15, ఆగస్టు 2020, శనివారం

హరిపదము

హరిపదము.
పరమసుఖద మహో
హరినిగొలుచుటయే
నరుల కిదియె సదా
చరణమగును కదా

హరిపదము.
హరికథలు వినరే
హరికి జయ మనరే
హరికి మనసిడుటే
పరమసుఖ మనరే



ఈ హరిపదవృత్తంలో పాదానికి 8 అక్షరాలుంటాయి.  గురులఘుక్రమం IIIIIIIU. అంటే గణవిభజన  న-న-లగ అన్నమాట.  ప్రాసనియమం ఉంటుంది. యతిమైత్రి స్థానం అవసరం లేదు.

ఈ‌ హరిపదం‌ పాదం‌ ముందొక మరో లఘువును చేర్చుదాం‌ అంటే అది మదనకం అవుతుంది. రెండు లఘువులను చేర్చితే అది మకరముఖి అవుతుంది. ఏకంగా మూడు లఘువులను చేర్చితే అది దమనకవృత్తం అవుతుంది. బాబో ఇంకా లఘువు లెందుకు లెండి అంటారా, హరిపదం  పదారంభంలో ఒక గురువును చేర్చితే అది ధౌనికం అనే వృత్తం అవుతుంది.  ఒకటి చాలదంటారా, ఎడాపెడా చెరొక గురువునూ చేర్చితే అది ఉపధాయా వృత్తం అవుతుంది. హరిపదం పాదంలో గురువును ర-గణం చేస్తే అది చితిభృత వృత్తం అవుతుంది. ఆ గురువును అలాగే ఉంచి మరొక ర-గణం చేర్చితే అది గల్లకవృత్తం అవుతుంది. ఇంకా చాలానే వృత్తాల్లో ఈ హరిపదం తాలూకు గురులఘుక్రమం కనిపిస్తుంది.

ఈ‌ హరిపదం నడకను పరిశీలిద్దాం. పాదానికి తొమ్మిది మాత్రలున్నాయి. మూడేసి మాత్రలుగా నడప వచ్చును.

పరమ - సుఖద - మహో
హరిని - గొలుచు - టయే
నరుల - కిదియె - సదా
చరణ - మగును - కదా

కాని మూడేసి మాత్రలుగా కాక ఇతరత్రా కూడా నడక రావచ్చును. హరిపదానికి మరొక మాత్రను చివరన జత  కలిస్తే పది  మాత్రలు అవుతాయి. ఈ‌పది మాత్రలూ ఐదేసి మాత్రల కాలఖండాలుగా రెండుగా విరగి ఈ‌పద్యం నడుస్తుంది. కాని పరిశీలించగా ఒక్కోటి ఆరు మాత్రల కాలఖండాలుగా నడుస్తున్నది! రెండవభాగానికి ఒకటికి బదులు రెండు మాత్రలు కలుస్తున్నాయి నడకలో!

హరికథలూ - వినరే
హరికి జయా - మనరే
హరికి మనా - సిడుటే
పరమసుఖా- మనరే

ఈ‌వృత్తాన్ని నడపటంలో‌ ఉన్న చిక్కల్లా వరసగా ఏడు లఘువులు వేయవలసి రావటమే కాదు మనకు కావలసిన పదాలు ఇందులో‌ ఇమడకపోవచ్చును. అన్నీ‌ దాదాపుగా లఘువులే‌ కదా. మాటవరసకి ఇక్కడ నేరుగా రామా అందా మంటే, వరసగా రెండు గురువులు వేసే అవకాశం లేదు. పోనీ‌ రామ అందా మంటే  మాటను రెండు పాదాలమధ్యన విరచి వ్రాయవలసి ఉంటుంది. పాదోల్లంఘనం‌ చేయకుండా అది వీలు కాదు. చిన్నచిన్న పద్యాల్లో పాదోల్లంఘనం అంత బాగుండదు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి