12, ఆగస్టు 2020, బుధవారం

పదమాలి

పదమాలి.
దయగల తండ్రి కృతాంతదండనా
భయమును ద్రోసి యనన్యభక్తిమై
జయజయరామ యటంచు జక్కగా
ప్రియముగ పాడు బుధాళి వేడుకన్


పదమాలి వృత్తంలో పాదానికి 12 అక్షరాలు. పాదంలో గురులఘుక్రమం IIIIUIIUIUIU. అంటే దీనికి గణవిభజన న - జ - జ - ర అని. యతిస్థానం 10వ అక్షరం.
 

ఈ పదమాలికి మాలతి అని మరొక పేరుంది. ఈ‌ పదమాలి పాదం చివర మరొక గురువును జోడిస్తే అది మృగేంద్రముఖం అనే వృత్తం అవుతుంది.  కల్పలతాపతాకినీ వృత్తపాదంలో ఈ పదమాలి చివరి పన్నెండు స్థానాలుగా ఉంది. ఈ పదమాలి మొదటి రెండులఘువులనూ తొలగిస్తే అది సహజావృత్తం అవుతుంది. వా బదులు ఒక గురువును ఉంచితే అది ఉత్పలమాలలో అంతర్భాగంగా కనిపిస్తుంది.

దీని నడక మిశ్రగతిలో వస్తుంది. మిశ్రగతి అంటే 3-4 మాత్రల గణాలు వరుసగా వస్తూ ఉండటం.

ఈ మిశ్రగతిలో పై పద్యం నడక ఇలా ఉంటుంది.


దయగల - తండ్రి - కృతాంత - దండ - నా
భయమును - ద్రోసి - యనన్య - భక్తి - మై
జయజయ - రామ - యటంచు - చక్క - గా
ప్రియముగ - పాడు - బుధాళి - వేడు - కన్


ఇక్కడ నడక 4 - 3 - 4 - 3 - 2 మాత్రలుగా కనిపిస్తోంది కదా అంటే పాదాంతంలో గురువును మనకు కావలసి వస్తే మరో రెండు మాత్రల కాలానికి పొడిగించుకోవచ్చును. అప్పుడు 4 - 3 - 4 - 3 - 4 మాత్రలుగా అవుతున్నది.  ఇలా ఉంది కాబట్టి మిశ్రగతి అన్నమాట. మిశ్రగతికి నప్పే తాళం త్రిపుటతాళం. ఇక్కడ మనకు సానుకూలాంశం యతిస్థానం తాళం మధ్యలో రావటం లేదు.  అందుచేత ఈ నడక సహజంగానే నప్పుతుందని నా విశ్వాసం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి