మాణవకము.
లోకము లేలేవు గదా
శ్రీకర రామా కృపతో
నీకృపయే లేనపు డీ
లోకములే లేవు గదా
మాణవకము.
రామ సదా ప్రేమమయా
కామిత వాంఛాఫలదా
భూమిని నీభక్తులకే
బాములు లేకుండు గదా
ఈమాణవక వృత్తానికి గురులఘు క్రమం UIIUUIIU. అంటే గణవిభజన భ - త - లగ. అంటే పాదానికి కేవలం 8 అక్షరాలన్నమాట. అందుచేత యతిస్థానం ఏమీలేదు. ప్రాసనియమం ఉంది వృత్తం కావట్టి. దీని గురులఘుక్రమాన్ని మనం UIIU - UIIU అని కూడా అనుకోవచ్చును. ఈ విధానంగా విడదీసి చూడటం దీని నడకకు అనుగుణమైన విభజన అవునా అన్నది ఆలోచనీయం. కాని వృత్తపాదంలో మొదటి సగమూ తదుపరి సగమూ ఒకే గురులఘుక్రమంతో ఉన్నవన్నది మాత్రం స్పష్టం అవుతున్నది కదా. త్రికగణాలతో అన్నింటికీ ఒకే కొలబద్దతో లక్షణాలు వ్రాసుకోవటం వలన ఇలాంటి చిన్న పెద్దా విషయాలు మరుగున పడిపోతున్నాయి.
మాణవకవృత్త పాదానికి అదనంగా ఒక గురువును చివర ఉంచితే అది శంబరధారీవృత్తం అవుతుంది. పాదం మొదట ఒక స-గణం చేర్చితే హరికాంతావృత్తమూ, భ-గణం చేర్చితే కలస్వనవంశవృత్తమూ అవుతాయి. ఆ హరికాంత చివర మరొక గురువును చేర్చితే అది కరమాల. ఆ కలస్వనవంశకు ముందు మరొక భ-గణాన్ని చేర్చితే అది కర్ణిశర వృత్తం. ఇంకా మరొక ఇరవై చిల్లర వృత్తాలో ఈమాణవకం సంతకం కనిపిస్తుంది.
ఈ వృత్తానికి తెలుగులో పూర్వకవి ప్రయోగాలు ఏమన్నా ఉన్నాయా అన్నది తెలియదు.
ఈ మాణవకం నడకను చూదాం. ఈ వృత్తంలో పాదానికి ఉన్నది పన్నెండు మాత్రలు. పాదం సమద్విఖండనగా విరుపుతో నడుస్తుంది. ఐతే ఒక్కో ఖండంలోనూ ఆరేసి మాత్రలున్నా, అవి ఎనిమిదేసి మాత్రలుగ నడుస్తాయి! అంటే చతురస్ర గతి అన్నమాట. అదెలా అంటే పాదం అర్ధభాగాల చివర ఉన్న గురువును నాలుగు మాత్రలుగా పలకవలసి ఉంటుంది.
రామ స - దా - ప్రేమమ - యా
కామిత -వాం - ఛాఫల - దా
భూమిని - నీ - భక్తుల - కే
బాములు -లే - కుండు గ - దా
శ్రీ వల్లభ వఝుల అప్పల నరసింహమూర్తి కవి గారి మాణవక వృత్తం చూడండి.
మా యని శ్రీ యే నయమా
మా యన లక్ష్మీశు యమా
యా యశు శిక్షా శయమా
మా యశ మౌగా నియమా
ఇదొక చిత్రకవిత్వ విన్యాసం కాబట్టి పద్యం మరీ సుభగంగా ఉండకపోవటంలో వింత లేదు. ఈ పద్యమే కొద్ది మార్పుతో మరొక చోట కూడా కనిపిస్తోంది.
15, ఆగస్టు 2020, శనివారం
మాణవకము
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి