16, ఆగస్టు 2020, ఆదివారం

రథోధ్ధతము

రథోధ్ధతము.
పంతగించి కలి బాధపెట్టినన్
చింతయన్న దెటు చెంత జేరు నా
యంతరంగవిభు డైన రాముడే
సంతతంబు సుఖశాంతులీయగన్


ఈ రథోధ్ధత వృత్తానికి పాదానికి 11 అక్షరాలు. గురులఘుక్రమం UIUIIIUIUIU. అంటే గణవిభజన  ర-న-ర-వ యతిమైత్రి స్థానం 7వ అక్షరం. ప్రాసనియమం పాటించాలి.

ఈ‌రధోధ్ధత వృత్తపాదానికి ముందొక గురువును చేర్చితే అది లలితావృత్తం అవుతుంది. ఆ గురువు బదులు రెండు లఘువులను ఉంచితే అది మంజుభాషిణీవృత్తం. ఏకంగా నాలుగు గురువులను ఉంచితే అది ప్రభద్రకం. ఈ ప్రభద్రకం పాదం చివర ఒక గురువును ఉంచితే అది వాణినీ వృత్తం, ర-గణం ఉంచితే అది నందనం అనే వృత్తం.  రథోధ్ధత పాదం‌ ముందు హ-గణం ఉంచితే అది మంజుమాలతి.

విశ్వనాథవారి రామయణకల్పవృక్షం బాలకాండ ఇష్టిఖండము నుండి

    ఱేని సంతస మెఱింగి సూతుఁడున్
    దోన వాజులను దూఁకజేయఁగన్
    బూనికన్ ఖదను పోవఁగా రథా
    స్థాని రాజు మెయిసాగ నూగుచున్ 

ఆధునికులు శ్రీ నేమాని రామజోగిసన్యాసి రావు గారి ఆథ్యాత్మ రామాయణం నుండి ఒక రథోధ్ధతం.

     వారిజాతహితవంశవర్థనా
     వారిజాక్ష శ్రితపారిజాతమా
     వారిజాతభవవందితా నమ
     స్కారమో వరద సద్గుణాకరా

ఈ రథోధ్ధత వృత్తం‌ నడక గురించి ఆలోచిద్దాం. ఈ వృత్తం పాదంలో గురులఘుక్రమం UIUIIIUIUIU అంటే మొత్తం‌16 మాత్రలున్నాయి. పాదం అర్ధభాగంలో అంటే మొదటి అరు అక్షరాలలో 8 మాత్రలూ, ద్వితీయార్ధంలో  8 మాత్రలూ ఉన్నాయి.

ఒక విధంగా చూస్తే, ఈ‌ భాగాలు రెండూ‌ కూడా 3 + 5 మాత్రల ఖండాలుగా విరుగుతాయి. యతిమైత్రి స్థానం చక్కగా రెండవ భాగం మొదటి అక్షరం‌పైన పడింది.

ఱేని - సంతస మె - ఱింగి - సూతుఁడున్
దోన - వాజులను - దూఁక - జేయఁగన్
బూని - కన్ ఖదను - పోవఁ - గా రథా
స్థాని - రాజు మెయి - సాగ -నూగుచున్

మరొక విధంగా చూస్తే పూర్వార్థంలో హ-హ-లల  ఐతే ఉత్తరార్థంలో హ-హ-గ కదా కాబట్టి ఇలా చదువ వచ్చును.
ఱేని  సంత - స మె - ఱింగి - సూతుఁ - డున్
దోన వాజు  - లను - దూఁక - జేయఁ - గన్
బూని కన్ ఖ  - దను - పోవఁ - గా ర - థా
స్థాని  రాజు - మెయి - సాగ -నూగు - చున్

ఈ విధంగా ఉదాహరణకు ఇచ్చిన పద్యం
పంత గించి - కలి  - బాధ పెట్టి  -నన్
చింత యన్న - దెటు  - చెంత జేరు - నా
యంత రంగ - విభు  - డైన రాము  - డే
సంత తంబు - సుఖ  - శాంతు లీయ - గన్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి