అనుష్టుప్పు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
అనుష్టుప్పు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

28, ఆగస్టు 2020, శుక్రవారం

పంచశిఖ

పంచశిఖ.
ధరణీతనయాకామా
పురుషోత్తమ నిష్కామా
పరమాత్మ పరంధామా
పరిపాలయమాం రామా


పంచశిఖ అనుష్టుప్పు ఛందస్సుకు చెందిన వృత్తాల్లో 28వది. దీని గురులఘుక్రమం IIUIIUUU. అంటే గణవిభజన స-స-గగ అన్నమాట. ఈ అనుష్టుప్పు ఛందస్సుకు చెందిన వృత్తాల్లో పాదానికి 8 అక్షరాలుంటాయి. ఈ వృత్త పాదంలోని 8 అక్షరాలకు 12 మాత్రలున్నాయి.

ఈ పంచశిఖ వృత్తాన్ని వ్రాయటం  కొంచెం కష్టం‌ కావచ్చును.

ఏదైనా వృత్తం యొక్క పాదం మొదట్లో ఉన్న గురువును రెండులఘువులుగా కాని, రెండులఘువులను ఒక గురువుగా కాని మార్చటం ద్వారా వేరే సోదరవృత్తం రావచ్చును. ఇక్కడ ఈ పంచశిఖ వృత్తానికి అలా ఏర్పడుతున్న సోదరవృత్తం పేరు వేధ(త-య-గ).

పంచశిఖ వృత్తం యొక్క గురులఘుక్రమాన్ని తమతమ గురులఘుక్రమాల్లో కలిగి యున్న వృత్తాలు కొన్నున్నాయి. అవి  ఆరభటి(భ-భ-న-జ-య-గ), ఇంద్ర(జ-జ-య-గ), ఉదరశ్రీ(స-స-మ), కృతమాల(త-జ-య-భ-గగ), క్రీడాయతన(స-స-స-త-వ), క్రీడితకటక(భ-స-స-మ-మ), క్రోశితకుశల(భ-స-స-గగ), చార్వటక(మ-భ-భ-మ-మ), ధవలకరీ(న-న-భ-మ), భాస్కర(భ-న-జ-య-భ-న-న-స-గ), భూరిశిఖ(స-స-మ-త-వ), వార్తాహరి(న-జ-య-గగ), వాసవిలాసవతి(భ-భ-భ-మ-గ), విలంబితమధ్య(మ-స-స-గగ), విష్టంభ(స-స-స-గగ), వేల్లితవేల(భ-భ-భ-మ-స-న-న-స), శృంఖలవలయిత(భ-న-న-భ-మ-న-న-జ-వ), సరమాసరణి(స-స-త-త-గగ) వృత్తాలు.

ఈ పంచశిఖ వృత్తం యొక్క గురులఘుక్రమంలో అరజస్క(జ-య), కరభిత్తు(స-స-గ), క్రీడ(య-గ), తిలక(స-స), దోల(స-గ), పంక్తి(భ-గగ), ప్రగుణ(స-గగ), వల(భ-గ), శిల(జ-వ), సింధురయ(భ-మ) వృత్తాలు అంతర్భాగంగా కనిపిస్తున్నాయి.

ఈ పంచశిఖ వృత్తం యొక్క గురులఘుక్రమంతో‌ మంచి పోలిక కలిగిన వృత్తాలు అఖని(న-జ-వ), అధీర(భ-మ-గ), అరాళి(జ-జ-వ), అర్ధకల(స-స-స), ఇంద్రఫల(భ-మ-గగ), ఉదిత(స-స-స-గ), కరశయ(న-భ-ర), కరాలి(స-స-వ), కలహ(స-భ-మ), కాండముఖి(జ-భ-భ-గ), కేర(ర-భ-భ-గ), ఖేలాఢ్య(మ-స-మ), గహన(భ-న-భ-గ), చంపకమాల(భ-మ-స-గ), చతురీహ(జ-భ-గగ), చిత్రపద(భ-భ-గగ), జర(జ-జ-జ-గ), ద్వారవహ(ర-త-య-గ), ధృతహాల(మ-భ-మ), పరిచారవతి(త-భ-భ-గ), ప్రసర(మ-స-స-గ), ఫలధర(న-న-భ-గ), మణిమధ్య(భ-మ-స), మదనోద్ధుర(భ-భ-ర), మధ్యాధార(మ-భ-మ-గ), మనోల(య-స-గగ), మౌరలిక(భ-భ-గ), రంజక(భ-స-స), వంశారోపి(య-భ-మ-గ), వర్హాతుర(త-భ-త-గ), వారవతి(స-భ-భ-గ), విద్య(త-జ-వ), విరాజికర(జ-య-గగ), విశదచ్ఛాయ(స-త-య-గ), విశ్వముఖి(భ-భ-భ-గ), వృతుముఖి(న-భ-గగ), వేధ(త-య-గ), శరగీతి(ర-స-గ), శరత్(న-భ-భ-గ), శరలీఢ(న-జ-య), సహజ(స-స-జ-గ), సురయానవతి(స-స-భ-గ), సుషమ(త-య-భ-గ), స్వనకరి(న-భ-గ).

పంచశిఖ వృత్తం పాదం మొదట హ-గణం చేరితే అది ఇంద్ర(జ-జ-య-గ) వృత్తం , మొదట స-గణం చేరితే అది విష్టంభ(స-స-స-గగ) వృత్తం , మొదట భ-గణం చేరితే అది క్రోశితకుశల(భ-స-స-గగ) వృత్తం , మొదట మ-గణం చేరితే అది విలంబితమధ్య(మ-స-స-గగ) వృత్తం , చివర గురువు చేరితే అది ఉదరశ్రీ(స-స-మ) వృత్తం

పంచశిఖ వృత్తం పాదంలో 2వ స్థానం వద్ద గురులఘువులను  గురువుగా మార్చితే అది మనోల(య-స-గగ) వృత్తం , 3వ స్థానం వద్ద గురులఘువులను  లఘువుగా మార్చితే అది రుద్రాళి(న-స-గగ) వృత్తం , 4వ స్థానం వద్ద గురులఘువులను  గురువుగా మార్చితే అది పరిధార(స-ర-గగ) వృత్తం , 5వ స్థానం వద్ద గురులఘువులను  గురువుగా మార్చితే అది యుగధారి(స-య-గగ) వృత్తం , 7వ స్థానం వద్ద గురులఘువులను  లఘువుగా మార్చితే అది కరాలి(స-స-వ) వృత్తం , 2వ స్థానం వద్ద గురులఘువులను  వ-గణంగా మార్చితే అది భారాంగి(జ-స-గగ) వృత్తం

పంచశిఖ వృత్తం పాదంలో 3వ స్థానం వద్ద  గురువు చొప్పిస్తే అది కలహ(స-భ-మ) వృత్తం , 3వ స్థానం వద్ద  గ-గ చొప్పిస్తే అది విశదచ్ఛాయ(స-త-య-గ) వృత్తం , 4వ స్థానం వద్ద  భ-గణం చొప్పిస్తే అది ఉపహితచండి(స-భ-స-గగ) వృత్తం

పంచశిఖ వృత్తం పాదంలో 3వ స్థానం వద్ద  గురువు తొలగిస్తే అది సురి(న-య-గ) వృత్తం , 4వ స్థానం వద్ద  లఘువు తొలగిస్తే అది రసధారి(స-య-గ) వృత్తం , 6వ స్థానం వద్ద  గురువు తొలగిస్తే అది కరభిత్తు(స-స-గ) వృత్తం , 1వ స్థానం వద్ద  ల-ల తొలగిస్తే అది సింధురయ(భ-మ) వృత్తం , 2వ స్థానం వద్ద  హ-గణం తొలగిస్తే అది గుణవతి(న-మ) వృత్తం , 4వ స్థానం వద్ద  ల-ల తొలగిస్తే అది అభిఖ్య(స-మ) వృత్తం

ఈ‌ పంచశిఖ నడకను చూస్తే ఇది ఆరు మాత్రల తరువాత చిన్న విరుపుతో‌కనిపిస్తున్నది. 

ధరణీతన  -  యాకామా
పురుషోత్తమ  -  నిష్కామా
పరమాత్మ ప  -  రంధామా
పరిపాలయ  -  మాం రామా 

సులభంగా చతుర్మాత్రాత్మికమైన గతితో ఇలా కూడా చాలా చక్కగా ఉన్నది.

ధరణీ  -  తనయా  -  కామా
పురుషో  -  త్తమ ని  -  ష్కామా
పరమా  -  త్మ పరం  -  ధామా
పరిపా  -  లయమాం  -  రామా

ఇలా చిన్న చిన్న వృత్తాలను అంత్యప్రాసలతో చెప్పటం వలన వాటికి మరింత శోభ వస్తుంది.

పంచశిఖా వృత్తానికి పూర్వకవి ప్రయోగా లున్నట్లు కనరాదు.

 


17, ఆగస్టు 2020, సోమవారం

హేమరూపము.

హేమరూపము.
ప్రేమతో పల్కుచుందువే
కామితం బిచ్చుచుందువే
రామ యీ మౌన మేలరా
స్వామి నా కేది దారిరా


 

ఈ‌హేమరూపవృత్తానికి పాదానికి 8 అక్షరాలుంటాయి. గురులఘుక్రమం UIUUIUIU. గణ విభజన ర-ర-వ అవుతుంది. చాదస్తులు కాని వారు ఈ‌ గురులఘుక్రమాన్ని ర-వ-ర అని  కూడా చూడవచ్చును. ఇదికొంచెం వికటకవి లాంటిది అనిపిస్తోది కదా. కావలస్తే హ-గణంతో మొదలు పెట్టి హ-త-ర అనీ చూడవచ్చును. ఇన్ని రకాలుగా చూడటం ఎందుకూ? అంత అవసరమా అనవచ్చును కొందరు. ఈ దృష్టికోణం అన్నది పద్యం‌ లయను పట్టుకొనే‌క్రమంలొ అవసరం కావచ్చును. ఈ వృత్తానికే అని కాదు. ఇతర వృత్తాలకూ ఈ దృక్కోణం నుండి ఆలోచించటం‌ చక్కగా ఉపకరిస్తుంది. నిజానికి పద్యం‌ యొక్క లయను గురులఘువుల అమరికను గుంపులుగా విడదీయటం ద్వారా చూస్తున్నాం అన్నప్పుడు గణాలుగా చూడవలసిన అవసరమే లేదు.

ఇప్పుడు ఉదాహరణకు ఇచ్చిన పద్యాన్ని చూదాం. 

ప్రేమ - తో పల్కు - చుందువే
కామి - తం బిచ్చు - చుందువే
రామ - యీ మౌన - మేలరా
స్వామి - నా కేది - దారిరా


ఇదే‌ ఉదాహరణను ఇలాగు చూసినా బాగానే ఉంటుంది. 

ప్రేమతో- పల్కు - చుందువే
కామితం - బిచ్చు - చుందువే
రామ యీ -  మౌన -మేలరా
స్వామి నా  - కేది -దారిరా

ఈ‌రెండు రకాల నడకల్లో‌ పోలిక ఉన్నా తగినంత భేదమూ‌ ఉందని గమనించ వచ్చును.

ఐతే ఈ‌పద్యాన్ని  సంప్రదాయికమైన గణవిభజనను తీసుకొని ఆ ర-ర-వ ఆధారంగా గతిని చూడగలమా చూదాం.
ప్రేమతో -పల్కుచుం - దువే
కామితం -బిచ్చుచుం - దువే
రామ యీ - మౌన మే - లరా
స్వామి నా  - కేది దా - రిరా

ఇక్కడ నడక సరిగా కుదిరినట్లు అనిపించటం‌ లేదు నాకు. కా

అందుచేత గణవిభజన అన్నది మరీ‌ అంత ముఖ్యమైన సంగతి కాదు. ముఖ్యమైనది గురులఘుక్రమం. అది నోటికి అనువు కాదు కాబట్టి గణవిభజన ద్వారా గుర్తుపెట్టుకోవటం. అంతే‌ కాని ఆ గణవిభజన పద్యం‌ లయను  చూపాలన్న నియమం లేదు. ఈ సంగతి బాగా గుర్తుపెట్టుకోవాలి.

ఈ హేమరూపానికి చుట్టాల సంగతి. దీనికి ఒక డజను సంఖ్యలో‌ఉందది. ఈ పద్యపాద‌ం ముందు హ-గణం చేరితే అది కర్ణపాలిక, ర-గణం చేరితే అది గహ్వరం, న-గణం చేరితే‌ కనకమంజరి, భ-గణం చేరితే అది వారయాత్రికం.  ఇంకా కొన్ని చుట్టరికాలున్నాయి కాని ఇవి చాలు.

పూర్వకవులు ఎవరన్నా ఈ‌ హేమరూపవృత్తాన్ని వాడారా అన్నది తెలియదు.

కరాళి / కేతుమాల

కరాళి.
జయ దీనజనావనా
జయ సత్యపరాక్రమా
జయ నిత్యయశోధనా
జయ రామ జనార్దనా

ఈ‌ కరాళీవృత్తానికి కేతుమాల అని కూడా పేరుంది. దీని పాదంలో 8 అక్షరాలుంటాయి. గురులఘుక్రమం IIUIIUIU. గణవిభజన స-స-వ అని.

ఈ కరాళీ వృత్తం చుట్టాలను పలకరిద్దాం. ఒక యాభై వృత్తాలున్నాయి బంధుగణం! దీని పాదం ముందొక లఘువును చేర్చితే అది కరశయావృత్తమూ‌ అలా కాదని గురువును చేర్చితే అది మదనోధ్ధురా వృత్తం. దీని పాదం‌ ముందు వ-గం చేర్చితే అది జరా వృత్తమూ ఆ వ_గణం చివర ఉంచితే అది  సహజా వృత్తం. కరాళి పాదం చివర జ-గణం చేరితే అది జవనశాలిని, మ-గణం చేరితే అలితాగమనం, య-గణం చేరితే అది విమ.  ఈ‌కరాళి పాదం ముందు న-గణం చేరితే అది సమ్మదమాలిక, స-గణం చేరితే అది ఉపచిత్రం. ఇంకా బోలెడు చోట్ల ఈ‌కరాళీ సంతకం‌ కనిపిస్తుంది.

ఈ‌ వృత్తం‌ నడకను చూదాం. పాదంలో ఉన్నవి ఎనిమిది అక్షరాలు.  పాదం‌ మధ్యలో విరుపు కనిపిస్తోంది. ఉత్తరార్ధంలో ఆరు మాత్రలున్నాయి. పుర్వార్ధంలో ఐదే కాని కొంచెం సాగదీసి ఆరుగా పలకవచ్చును. జయ దీ..న అన్నట్లుగా. అప్పుడు మరింత కర్ణపేయంగా ఉంటుంది.

జయ దీన - జనావనా
జయ సత్య - పరాక్రమా
జయ నిత్య - యశోధనా
జయ రామ - జనార్దనా

వాంతభార

వాంతభార.
జయము భూపాలకేంద్రా
జయము కారుణ్యసాంద్రా
జయము త్రైలోక్యవంద్యా
జయము శ్రీరామచంద్రా

వాంతభార.
అభయదం రామనామం
విభవదం రామనామం
శుభకరం రామనామం
ఉభయదం రామనామం


ఈ‌వాంతభార వృత్తంలో పాదానికి 8 అక్షరాలు. గురులఘుక్రమం IIIUUIUU. అంటే గణవిభజన న-త-గగ అని. ప్రాసనియమం పాటించాలి.

ఈ వాంంతభారకు చుట్టాలను చూదాం. దీని పాదం చివర వ-గణం చేరితే అది చరపదం. ఆ చరపదం పాదం ముందు న-గణం చేరితే అది చంద్రిక. గగ-గణం చేరితే అది నిర్మేధ. పాదం ముందు న-గణం చేరితే అది పరిమళలలితం. పాదం ముందు లఘువునూ చివర గురువునూ చేర్చితే అది సురాక్షి. ఆ సురాక్షికి పాదం చివర మరొక గురువును చేర్చితే అది వికసితపద్మావళి. ఇవి కాక మరొక ఇరవై దాకా చుట్టాలున్నాయి.


ఈ వాంతభారను పూర్వకవులు ఎవరన్నా ప్రయోగించారా అన్నది తెలియదు.

ఈ వాంతభార నడకను చూదాం. పద్యపాదంలో  ఉన్న వి ఎనిమిది అక్షరాలే. నడిమికి విరుపు కనిపిస్తోంది. ఐతే చివరి అక్షరం ముందు మరొక విరుపూ నడకలో వస్తోంది. ఇలా రావటం ద్వారా పాదం మూడుఖండాలైనది. మొదటి రెండు ఖండాలలోనూ ఐదేసి మాత్రలున్నాయి. చివరి గురువును మనక్కావలసింత లాగి ఐదు మాత్రలుగా ఉఛ్ఛరించా వచ్చును.

జయము భూ - పాలకేం - ద్రా
జయము కా - రుణ్యసాం - ద్రా
జయము త్రై - లోక్యవం - ద్యా
జయము శ్రీ - రామచం - ద్రా

అభయదం - రామనా - మం
విభవదం - రామనా - మం
శుభకరం - రామనా - మం
ఉభయదం - రామనా - మం


15, ఆగస్టు 2020, శనివారం

హంసరుతము.

హంసరుతము.
శ్రీరామా యనుచు వేడన్
కారుణ్యం‌ బెసగ వాడే
ధారాళంబుగను కోర్కుల్
ధారాపాతముగ నీడా



ఈ‌హంసరుత వృత్తం పాదంలో 8 అక్షరాలుంటాయి. గురులఘుక్రమం UUUIIIUU. అంటే గణవిభజన  మ-న-గగ. ప్రాసనియమం పాటించాలి.

ఈ హంసరుతం పాదానికి చివర మరొక గురువును చేర్చితే అది అయనపతాక అవుతుంది. పాదం చివర మ-గణం చేరిస్తే అది భూరిఘటకం అవుతుంది. ఆ భూరిఘటకానికి ముందు మరొక రెండు గురువులను తగిలిస్తే అది ఉల్కాభాసం అవుతుంది. 


విశ్వనాథ వారి రామాయణకల్పవృక్షం బాలకాండము అవతారఖండములోని

హంసరుతము.
శ్రీ సంపాదితములై య
భ్యాసం బొప్పఁగ సరోజా
వాసంబై మధురవంబై
కూసెన్ మత్తకలహంసల్


ఈ హంసరుతం‌ నడకను చూస్తే ఇది మ-న-గగ అని ప్రతి గణం దగ్గరా విరుపుతో‌ కనిపిస్తోంది.


శ్రీరామా - యనుచు - వేడన్
కారుణ్యం - బెసగ - వాడే
ధారాళం - బుగను - కోర్కుల్
ధారాపా - తముగ - నీడా


మాణవకము

మాణవకము.
లోకము లేలేవు గదా
శ్రీకర రామా కృపతో
నీ‌కృపయే లేనపు డీ
లోకములే లేవు గదా


మాణవకము.
రామ సదా ప్రేమమయా
కామిత వాంఛాఫలదా
భూమిని నీభక్తులకే
బాములు లేకుండు గదా


ఈ‌మాణవక వృత్తానికి గురులఘు క్రమం UIIUUIIU. అంటే గణవిభజన భ - త - లగ. అంటే పాదానికి కేవలం 8 అక్షరాలన్నమాట. అందుచేత యతిస్థానం ఏమీ‌లేదు. ప్రాసనియమం ఉంది వృత్తం‌ కావట్టి. దీని గురులఘుక్రమాన్ని మనం UIIU - UIIU అని కూడా అనుకోవచ్చును. ఈ విధానం‌గా విడదీసి చూడటం దీని నడకకు అనుగుణమైన విభజన అవునా అన్నది ఆలోచనీయం. కాని వృత్తపాదంలో మొదటి సగమూ తదుపరి సగమూ ఒకే గురులఘుక్రమంతో ఉన్నవన్నది మాత్రం స్పష్టం అవుతున్నది కదా. త్రికగణాలతో‌ అన్నింటికీ ఒకే కొలబద్దతో లక్షణాలు వ్రాసుకోవటం వలన ఇలాంటి చిన్న పెద్దా విషయాలు మరుగున పడిపోతున్నాయి.

మాణవకవృత్త పాదానికి అదనంగా ఒక గురువును చివర ఉంచితే అది శంబరధారీవృత్తం అవుతుంది. పాదం‌ మొదట ఒక స-గణం చేర్చితే హరికాంతావృత్తమూ, భ-గణం చేర్చితే కలస్వనవంశవృత్తమూ అవుతాయి. ఆ హరికాంత చివర మరొక గురువును చేర్చితే అది కరమాల. ఆ కలస్వనవంశకు ముందు మరొక భ-గణాన్ని చేర్చితే అది  కర్ణిశర వృత్తం. ఇంకా మరొక ఇరవై చిల్లర వృత్తాలో ఈ‌మాణవకం సంతకం కనిపిస్తుంది.

ఈ వృత్తానికి తెలుగులో పూర్వకవి ప్రయోగాలు ఏమన్నా ఉన్నాయా అన్నది తెలియదు.

ఈ‌ మాణవకం‌ నడకను చూదాం. ఈ వృత్తంలో పాదానికి ఉన్నది పన్నెండు మాత్రలు. పాదం సమద్విఖండనగా విరుపుతో‌ నడుస్తుంది. ఐతే ఒక్కో ఖండంలోనూ ఆరేసి మాత్రలున్నా, అవి ఎనిమిదేసి మాత్రలుగ నడుస్తాయి! అంటే చతురస్ర గతి అన్నమాట. అదెలా అంటే పాదం అర్ధభాగాల చివర ఉన్న గురువును నాలుగు మాత్రలుగా పలకవలసి ఉంటుంది.

రామ స - దా - ప్రేమమ - యా
కామిత -వాం - ఛాఫల - దా
భూమిని - నీ - భక్తుల - కే
బాములు -లే - కుండు గ - దా


శ్రీ వల్లభ వఝుల అప్పల నరసింహమూర్తి కవి గారి మాణవక వృత్తం చూడండి.

    మా యని శ్రీ యే నయమా
    మా యన లక్ష్మీశు యమా
    యా యశు శిక్షా శయమా
    మా యశ మౌగా నియమా

ఇదొక చిత్రకవిత్వ విన్యాసం కాబట్టి పద్యం మరీ సుభగంగా ఉండకపోవటంలో వింత లేదు. ఈ పద్యమే కొద్ది మార్పుతో‌ మరొక చోట కూడా కనిపిస్తోంది.

ప్రమాణిక

ప్రమాణిక.
ధరాసుతామనోహరా
ధరాతలాధినాథుడా
సురారిలోక కాలుడా
బిరాన రామ బ్రోవరా

ప్రమాణిక.
ధరాత్మజామనోహరా
మొరాలకింప వేమిరా
పరాకు మాని ప్రోవరా
తరింపజేయరా ప్రభూ


ఈ ప్రమాణిక వృత్తంలో‌ పాదానికి 8 అక్షరాలు. గురులఘుక్రమం  IUIUIUIU. అంటే గణవిభజన  జ-ర-లగ . యతి మైత్రి అవసరం లేదు. ప్రాసనియమం ఉంది. ఈ వృత్తాన్ని ప్రమాణి అని కూడా అంటారు.

రెండు ప్రమాణిక పాదాలు కలిపితే అది పంచచామరం అవుతుంది. ఆ పంచచామరాన్నే‌ నరాచ అనీ అంటారు. అదనంగా పాదం ముందొక లఘువును ఉంచితే అది భుజంగసంగత వృత్తం అవుతుంది, రెండు లఘువులను ఉంచితే అది  మనోరమా వృత్తం అవుతుంది. ఎడాపెడా చెరొక గురువునూ తగిలిస్తే అది మయూరసారిణీ వృత్తం అవుతుంది. పాదం చివర ఒక వ-గణం కలిపితే అది సరావికా వృత్తం అవుతుంది, రెండు వ-గణాలు కలిపితే లలామలలితాధరా వృత్తం అవుతుంది. పాదం చివర మ-గణం చేర్చితే అమోఘమాలికావృత్తం అవుతుంది. పాదం చివర జ-ర గణాలు కలిపితే కుండలికావృత్తం అవుతుంది. ఇంకా ముఫ్ఫై చిల్లర వృత్తాల్లోనూ ఈ‌ప్రామాణిక గురులఘుక్రమం కనిపిస్తుంది.

జగత్ప్రసిధ్ధమైన  గణేశ పంచరత్న స్తోత్రం ఈ‌ పంచచామర వృత్తాల్లోనే ఉంది. ఒక సారి  ఇక్కడ చదువుకోండి. ఉదాహరణకు ఒక శ్లోకం.

ముదాకరాత్తమోదకం సదావిముక్తి సాధకం
కళాధరావతంసకం విలాసిలోక రక్షకమ్
అనాయకైకనాయకం వినాశితేభదైత్యకం
నతాశుభాశునాశకమ్ నమామితం వినాయకం

నడక చూస్తే ఈ‌ప్రమాణి వృత్తం నడిమికి విరుగుతూ జగ - జగ అన్నట్లుగా ఉంటుంది. లేదా అక్కడక్కడ ఇది జ - హ - ర అన్నట్లుగా ఉంటుంది.  ఎదురు నడకతో‌ ప్రారంభం కావటమే ఈ‌ వృత్తాల్లోని ప్రత్యేకమైన అందానికి కారణం అనుకుంటాను.

ధరాసుతా - మనోహరా
ధరాతలా - ధినాథుడా
సురారి - లోక -కాలుడా
బిరాన - రామ - బ్రోవరా
 

తెలుగులో పూర్వప్రయోగాలు ఎక్కువగా ఉన్నట్లు తోచదు. అధునిక ప్రయోగం కావ్యకంఠ గణపతి ముని గారు చేసిన ఆధ్యాత్మిక సర్వోపచార పూజ ఒకటి చక్కటిది ఉన్నది. తప్పక చదవదగినది. గబ్బిట దుర్గా ప్రసాద్ గారి సరసభారతి బ్లాగులో ఆ ఆధ్యాత్మిక సర్వోపచార పూజను చదువుకొన వచ్చును.

ఇంకొకటి గుండు మధుసూదన్ గారి గణేశస్తుతి శ్లోకం చూడండి.

గజాననా! ఘనాకృతీ!
ప్రజావళీ ప్రమోద! స
ద్ద్విజ స్తుత! స్థిరా! చతు
ర్భుజా! నమో ఽస్తు తే ఽనిశమ్

ఈ‌ప్రమాణి వృత్తం నడక మహా రమణీయంగా ఉంటుంది. మీరూ‌ ప్రయత్నించండి.

లసదసు / మహి / కమల / వసన

లసదసు.
మన యెడల రాముడే
తన కృపను జూపగా
మన కభయ మీయగా
మన కిక జయంబులే


ఈ‌ లసదసు వృత్తానికి మహి, కమల, వసన అన్న పేర్లు కూడా ఉన్నాయి. దీని గురులఘుక్రమం  IIIIIUIU. అంటే గణవిభజన న-స-లగ.

ఈ‌ లసదసు బంధుగణాన్ని చూదాం. ఈ  వృత్తపాదం చివర మరొక గురువును చేర్చితే అది బింబ వృత్తం అవుతుంది. పాదం చివర ల-గ చేర్చితే అనుచాయిక, య-గణం చేర్చితే‌ పంచశాఖి, ర-గణం చేర్చితే ప్రసృమరకర అవుతుంది. ఇంకా మరొక నలభైపైన వృత్తాల్లో ఈ లసదసు గురులఘుక్రమం కనిపిస్తుంది.

ఈ‌ లసదసు యొక్క నడకను చూదాం. ఈ‌వృత్తంలో మొత్తం పది మాత్రలున్నాయి. ఉన్న రెండు గురువులూ‌ పాదం చివరకు సద్దుకున్నాయి. కాబట్టి ఐదేసి మాత్రలు ఒక ఖండంగా నడక కనవస్తోంది.

మన యెడల - రాముడే
తన కృపను - జూపగా
మన కభయ - మీయగా
మన కిక జ - యంబులే

తుంగ

తుంగ.
పరమ సఖుడ రామా
పరమ హితుడ రామా
నిరుపముడవు నిన్నే
యరసి కొనెద నాలో

తుంగ.
హరి మన సఖుడైతే
హరి మన గురుడైతే
హరి మన హితుడైతే
మరి యిక సుఖమేగా


ఈ తుంగ అనే వృత్తానికి గురులఘుక్రమం IIIIIIUU. అంటే న-న-గగ అనేది గణవిభజన అన్నమాట. ప్రాసనియమం‌ పాటించాలి. యతిమైత్రి అవసరం లేదు.

ఈ తుంగకు బంధుగణాన్ని చూదాం. పాదం చివర ఒక గురువును చేర్చితే అది భుజగశిశుభృతం అవుతుంది. పాదం ముందు రెండు లఘువులను చేర్చితే అనిమావృత్తం అవుతుంది, రెండు గురువులను చేర్చితే ఉన్నాలం అవుతుంది, గ-ల చేర్చితే  ఉపధాయా వృత్తం అవుతుంది. పాదం చివర మ-గణం చేర్చితే అది కలితకమలవిలాసం అవుతుంది, స-గణం చేర్చితే మదనయావృత్తం అవుతుంది, య-గణం చేర్చితే పరిమళలలితం అవుతుంది. పాదం చివరన కాక పాదం ముందు మ-గణం చేర్చితే అది మాత్రావృత్తం, స-గణం చేర్చితే సువృత్తి అవుతుంది. ఇవే కాక ఇంకా చాలా వృత్తాల్లో ఈ తుంగ తాలూకు గురులఘుక్రమం కనిపిస్తుంది.

ఈ‌ పద్యం నడక ఇలా ఉంది త్రిస్రగతిలో. ఇక్కడ చివర గురువులు రెండూ ఒక్కోటీ మూడేసి మాత్రలుగా పలుకుతున్నాయి.

పరమ - సఖుడ - రా - మా
పరమ - హితుడ - రా - మా
నిరుప - ముడవు - ని - న్నే
యరసి - కొనెద - నా - లో

వేరే విధంగా కూడా నడక ఉండవచ్చును. అదీ చూదాం. ఇక్కడ చతురస్ర గతిలో‌ పద్యం నడిచింది. చివరి గురువు మాత్రం అవసరార్ధం లాగి పలకాలి.

హరి మన - సఖుడై - తే
హరి మన - గురుడై -తే
హరి మన - హితుడై - తే
మరి - యిక - సుఖమే - గా

జెజ్జాల కృష్ణ మోహన రావు గారి పద్యం ఒకటి కనిపిస్తోంది ఇలా.

మనసు పిలిచెఁ గాదా
వినఁగ మనసు లేదా
దినము రజని నీవే
యినుఁడు శశియు నీవే


హరిపదము

హరిపదము.
పరమసుఖద మహో
హరినిగొలుచుటయే
నరుల కిదియె సదా
చరణమగును కదా

హరిపదము.
హరికథలు వినరే
హరికి జయ మనరే
హరికి మనసిడుటే
పరమసుఖ మనరే



ఈ హరిపదవృత్తంలో పాదానికి 8 అక్షరాలుంటాయి.  గురులఘుక్రమం IIIIIIIU. అంటే గణవిభజన  న-న-లగ అన్నమాట.  ప్రాసనియమం ఉంటుంది. యతిమైత్రి స్థానం అవసరం లేదు.

ఈ‌ హరిపదం‌ పాదం‌ ముందొక మరో లఘువును చేర్చుదాం‌ అంటే అది మదనకం అవుతుంది. రెండు లఘువులను చేర్చితే అది మకరముఖి అవుతుంది. ఏకంగా మూడు లఘువులను చేర్చితే అది దమనకవృత్తం అవుతుంది. బాబో ఇంకా లఘువు లెందుకు లెండి అంటారా, హరిపదం  పదారంభంలో ఒక గురువును చేర్చితే అది ధౌనికం అనే వృత్తం అవుతుంది.  ఒకటి చాలదంటారా, ఎడాపెడా చెరొక గురువునూ చేర్చితే అది ఉపధాయా వృత్తం అవుతుంది. హరిపదం పాదంలో గురువును ర-గణం చేస్తే అది చితిభృత వృత్తం అవుతుంది. ఆ గురువును అలాగే ఉంచి మరొక ర-గణం చేర్చితే అది గల్లకవృత్తం అవుతుంది. ఇంకా చాలానే వృత్తాల్లో ఈ హరిపదం తాలూకు గురులఘుక్రమం కనిపిస్తుంది.

ఈ‌ హరిపదం నడకను పరిశీలిద్దాం. పాదానికి తొమ్మిది మాత్రలున్నాయి. మూడేసి మాత్రలుగా నడప వచ్చును.

పరమ - సుఖద - మహో
హరిని - గొలుచు - టయే
నరుల - కిదియె - సదా
చరణ - మగును - కదా

కాని మూడేసి మాత్రలుగా కాక ఇతరత్రా కూడా నడక రావచ్చును. హరిపదానికి మరొక మాత్రను చివరన జత  కలిస్తే పది  మాత్రలు అవుతాయి. ఈ‌పది మాత్రలూ ఐదేసి మాత్రల కాలఖండాలుగా రెండుగా విరగి ఈ‌పద్యం నడుస్తుంది. కాని పరిశీలించగా ఒక్కోటి ఆరు మాత్రల కాలఖండాలుగా నడుస్తున్నది! రెండవభాగానికి ఒకటికి బదులు రెండు మాత్రలు కలుస్తున్నాయి నడకలో!

హరికథలూ - వినరే
హరికి జయా - మనరే
హరికి మనా - సిడుటే
పరమసుఖా- మనరే

ఈ‌వృత్తాన్ని నడపటంలో‌ ఉన్న చిక్కల్లా వరసగా ఏడు లఘువులు వేయవలసి రావటమే కాదు మనకు కావలసిన పదాలు ఇందులో‌ ఇమడకపోవచ్చును. అన్నీ‌ దాదాపుగా లఘువులే‌ కదా. మాటవరసకి ఇక్కడ నేరుగా రామా అందా మంటే, వరసగా రెండు గురువులు వేసే అవకాశం లేదు. పోనీ‌ రామ అందా మంటే  మాటను రెండు పాదాలమధ్యన విరచి వ్రాయవలసి ఉంటుంది. పాదోల్లంఘనం‌ చేయకుండా అది వీలు కాదు. చిన్నచిన్న పద్యాల్లో పాదోల్లంఘనం అంత బాగుండదు.

శ్రద్ధరా / సమానిక

శ్రద్ధరా
రామ నీదు భక్తుడరా
స్వామి నీకె మ్రొక్కుదురా
ప్రేమ మీఱ బ్రోవవయా
కామితార్ధ మీయవయా
 

 

ఈ శ్రధ్ధరా వృత్తానికి సమానిక అని మరొక పేరు. పాదానికి 8 అక్షరాలు. గురులఘుక్రమం UIUIUIIU. గణవిభజన ర-జ-లగ అని. పాదంలో మొత్తం 12 మాత్రలుంటాయి.

ఈ శ్రధ్ధరావృత్త పాదం ముందు రెండు లఘువులు చేర్చితే అది ప్రవాదపదవృత్తం అవుతుంది. అలాకాక పాదం చివర లగ చేర్చిటే అది వర్మితా వృత్తం అవుతుంది. ఆశ్చర్య మేమిటంటే ఇంత చిన్న గురులఘుక్రమం కేవలం ఆ రెండూ కాక ప్రపాతలికా, భస్త్రావిస్తరణం, విలాసవాసం, విరామవాటికా అనే మరొక నాలుగు వృత్తాల్లో‌ మాత్రమే‌ కనిపిస్తున్నది!

ఈ శ్రధ్దరా వృత్తం‌ నడక ప్రకారం చూస్తే UI - UI - UI - IU అన్నట్లు మూడేసి మాత్రల గణాలుగా విరుపుతో కనిపిస్తుంది.

ఉదాహరణలో ఇచ్చిన పద్యం నడక ఇలా త్రిస్రగతితో కనిపిస్తోంది.

రామ - నీదు - భక్తు - డరా
స్వామి - నీకె - మ్రొక్కు - దురా
ప్రేమ - మీఱ - బ్రోవ - వయా
కామి - తార్ధ - మీయ - వయా

చిన్నచిన్న పద్యాలను వ్రాసే టప్పుడు వీలైన విధంగా అంత్యప్రాసలను కూడా ప్రయోగిస్తే అవి మరింతగా అందగిస్తాయి.

ఈ శ్రధ్దరా పద్యం వ్రాయటం చాలా సులువు. ఔత్సాహికులు తప్పక ప్రయత్నించండి.

11, ఆగస్టు 2020, మంగళవారం

సింహగతి

సింహగతి.
రామునే తలపరాదా
ప్రేమతో పిలువరాదా 
నీ‌ మనోరథము నీయన్
స్వామి నీ కడకు రాడా
 
 సింహగతి.
 భామ  లందరును రారే
 ప్రేమ మీఱగను సీతా 
 రామచంద్రులకు వేడ్కన్
 క్షేమహారతుల నీరే



సింహగతి అనేది ఒక కొత్త వృత్తం. నా సృష్టియే. పాదానికి కేవలం 8 అక్షరాలు. దీనికి గణవిభజన ర-న-గగ. చిన్న వృత్తం‌కాబట్టి యతిస్థానం ఏమీ‌ ఉండదు. ప్రాసనియయం మాత్రం ఉంటుంది.

ఈ సింహగతి పాదం ముందు మరొక న-గణం చేర్చితే అది మదనమాలావృత్తం అవుతుంది. ఏకంగా నల-గణం అని నాలుగు లఘువులను చేర్చితే అది నయమాలినీవృత్తం అవుతుంది. పాదం ముందు న-గణమూ చివరన రెండుగురువులనూ చేర్చితే అది విపన్నకదనం అనే వృత్తం అవుతుంది. మత్తేభశార్దూలవిక్రీడీతవృత్తాల్లోనూ‌ మరికొన్నింటిలోనూ‌ ఈ సింహగతి అంతర్భాగంగా ఉంటుంది.

ఈ వృత్తానికీ‌ సింహరేఖకీ‌ చాలా దగ్గర చుట్టరికం. ఒకే ఒక అక్షరంలోనే తేడా. సింహరేఖలోని జ-గణాన్ని న-గణంగా మార్చటమే. చూడండి.

సింహరేఖ   U I U - I (U) I - U U
సింహగతి   U I U - I (I) I - U U

అంతే తేడా. కాని నడక వేరుగా వస్తుంది.  ఈ‌ సింహగతిలో సాధారణంగా  'న' గణం‌ దగ్గర విరుపు వస్తుంది. లేదా న-గణానికి పూర్వాక్షరం మీద విరుపు వస్తుంది. అలాగే చివరన ఉన్న 'గగ' పైన కూడా ఒక చిన్న విరుపు ఉందని గమనించండి.

      రామునే - తలప - రాదా
      ప్రేమతో - పిలువ - రాదా
      నీ‌ మనో - రథము - నీయన్
      స్వామి - నీ కడకు - రాడా

ఇందులో మొదటి మూడు పాదాల్లోనూ న-గణం దగ్గరా, చివరిపాదంలో తత్పూర్వాక్షరం పైనా విరుపు గమనించండి.  రెండవరకం విరుపు ప్రథానంగా ఉన్న పద్యం.

     భామ -లందరును - రారే
     ప్రేమ -మీఱగను - సీతా
     రామ - చంద్రులకు - వేడ్కన్
    క్షేమ - హారతుల - నీరే


ఈ సింహగతి వృత్తం వ్రాయట‌ం సులభం కాబట్టీ ఔత్సాహికులు తప్పకుండా ప్రయత్నించండి.

చిత్రపదము

చిత్రపదము
రాముని నమ్మిన వాడా
నీమము దప్పని వాడా
స్వామియె తోడుగ లేడా
కామిత మీయగ రాడా


ఈ చిత్రపదం పాదానికి 8 అక్షరాలుండే చిన్న వృత్తం. గురులఘుక్రమం UIIUIIUU. అంటే దీనికి గణవిభజన భ - భ - గగ. యతిస్థానం ఏమీ లేదు, చిన్న వృత్తంకదా అందుకని.  వృత్తం కాబట్టి ప్రాసనియమం తప్పదు.

ఈ చిత్రపద వృత్తం‌ పాదానికి ముందు ఒక లఘువునీ చివర్న ఒక గురువునీ తగిలిస్తే అది ఇంద్ర వృత్తం అవుతుంది. ఈ చిత్రపదం ముందు రెండు గురువులు తగిలిస్తే అది ప్రసర వృత్తం అవుతుంది. రెండు సరిపోవండీ అని నాలుగు గురువులు తగిలిస్తారా అది కాసారక్రాంత వృత్తం అవుతుంది. అబ్బే గురువు లెందుకండీ బరువులూ అంటారా? చిత్రపదం పాదం మొదట రెండు లఘువులు తగిలించండి. అది ఉదితం అనే వృత్తం అవుతుంది. ఆపైన పాదం చివర్న ఒక గురువునూ తగిలిస్తారా అప్పుడది విష్టంభం అనే వృత్తం అవుతుంది. చిత్రపదం పాదారంభంలో‌ ఒక భ-గణం తగిలిస్తారా? అప్పుడు అది దోధక వృత్తం అవుతుంది. పోనీ‌ స-గణం తగిలిస్తారా, అప్పుడది రోధక వృత్తం అవుతుంది.  మొదటేమీ వద్దండీ అని చిత్రపదం చివర్న ఒక స-గణం తగిలిస్తారా? అప్పుడు అది కలస్వనవంశం అనే వృత్తం అవుతుంది. ఇలా చాలానే చుట్టరికాలు చూడవచ్చును దీనికి.

ఆంధ్రామృతం బ్లాగులో చిత్రపదవృత్తానికి ఉదాహరణగా కనిపించినది. కొత్తపల్లి సుందరరామయ్యగారి వసుస్వారోచిషోపాఖ్యానం కృతి చివరి పద్యం ఇలా ఉంది.

     భక్త జనావన దక్షా
     ప్రాక్తన శాసన పక్షా
     యుక్త విచారణ దీక్షా
     సక్త మహేశ్వర రక్షా

ఈ చిత్రపదం నడకను చూస్తే చివరి రెండు గురువుల ముందు కొంచెం విరుపు కనిపిస్తోంది.
ఆసక్తి కలవారు కొన్ని చిత్రపదాలు వ్రాయటానికి ప్రయత్నించండి. చిన్నపద్యం - ఆట్టే చిక్కులు లేని పద్యం.
చిన్న చిన్న పద్యాలకు అంత్యానుప్రాసలు కూర్చితే మరింత శోభిస్తాయి.

10, ఆగస్టు 2020, సోమవారం

ఖేల

 ఖేల.
శౌరీ దీనజనాధారా
ధీరా రావణసంహారా
కారుణ్యాలయ శ్రీరామా
రారా రాఘవ రాజేంద్రా

ఇది ఒక కొత్తవృత్తం. పాదానికి 8 అక్షరాలు. గురులఘుక్రమం  UUUIIUUU. ఇలా బదులు UUU-II-UUU అని చెప్తే బాగుంటుందేమో.


కాని దీని నడక చూస్తే ఇది UU - UII - UUU అని తోస్తున్నది.

ఉదాహరణలో ఇచ్చిన పద్యం‌ నడక ఇలా మనోహరంగా ఉంది.

శౌరీ - దీనజ - నాధారా
ధీరా - రావణ - సంహారా
కారు - ణ్యాలయ - శ్రీరామా
రారా - రాఘవ - రాజేంద్రా

ఈ వృత్తానికి బంధుగణం బాగానే ఉంది చూడండి. ఈ క్రింది 19 వృత్తాలూ ఖేలావృత్తానికి తల్లులన్న మాట. ఎందుకంటే వీటిలో‌ఈ ఖేలావృత్తం‌ అంతర్భాగం కాబట్టి. ఇలా సరదాగా మన వృత్తాల్లో తల్లీపిల్లా వరసలు చూడవచ్చును. తమాషా ఏమిటంటే వాసకలీలా అనే వృత్తం పాదంలో ఈఖేలా పాదం రెండుసార్లు వస్తుంది!

1 ధృతహాలా 9 U - UUUIIUUU
2 ఖేలాఢ్యమ్ 9 UUUIIUUU - U
3 ద్వారవహా 10 UI - UUUIIUUU
4 మధ్యాధారా 10 U - UUUIIUUU - U
5 వంశారోపీ 10 I - UUUIIUUU - U
6 విశదచ్ఛాయః 10 II - UUUIIUUU
7 అంతర్వనితా 11 UUUIIUUU - UUU
8 కందవినోదః 11 UII - UUUIIUUU
9 సంసృతశోభాసారః 11 II - UUUIIUUU - U
10 లీలారత్నమ్ 12 UUU - UUUIIUUU - U
11 మత్తాలీ 12 UU - UUUIIUUU - UU
12 విభా 13 IIIIU - UUUIIUUU
13 అలోలా 14 UUUIIUUU - UUIIUU
14 ధీరధ్వానమ్ 14 UUUUUU - UUUIIUUU
15 విధురవిరహితా 17 II - UUUIIUUU - IIIIIIU
16 మఞ్జీరా 18 UUUU - UUUIIUUU - IIUUUU
17 శంభుః 19 II - UUUIIUUU - IIUUUUUUU
18 నిష్కలకణ్ఠీ 22 UII - UUUIIUUU - IIUUIIUUIIU
19 వాసకలీలా 22 UII - UUUIIUUU - II - UUUIIUUU - U

ఈ ఖేలా వృత్తంలోను అద్యంతాల గురువులను రెండింటినీ తొలగిస్తే అది తనుమధ్యా వృత్తం అవుతుంది. అంటే ఖేలావృత్తం‌ తల్లి అతే తనుమధ్య దాని పిల్ల అన్నమాట. ఈ ఖేలావృత్తం‌ నుండి ఆదిగురువును తీసివేస్తే ఒక నలభై వృత్తాలదాకానూ లేదా అంత్యగురువును తీసివేస్తే మరొక నలభై వృత్తాలదాకానూ ఆ గురులఘు క్రమాన్ని కలిగి ఉంటాయి - అంటే అవి దగ్గరి చుట్టాలన్న మాట ఖేలావృత్తానికి.

9, ఆగస్టు 2020, ఆదివారం

సింహరేఖ

సింహరేఖ.
రూపమా వినీలమేఘం    
చాపమా కృతాంతదండం
చూపులో కృపాప్రవాహం
తాపహారి రామతత్వం

       

ఇది భలే పొట్టివృత్తం. పాదానికి కేవలం 8 అక్షరాలే. దీనికి గణాలు ర - జ - గగ. అల్పపాదప్రమాణం కల వృత్తాల్లో యతిస్థానం ఉండదు కాబట్టి ఈ వృత్తానికి యతినియమం లేదు. వృత్తం కాబట్టి ప్రాసనియమం మాత్రం తప్పకుండా పాటించాలి.

గురులఘుక్రమం ప్రస్తారంచేస్తే (U I U) (I U I) (U U ). దీనినే‌ మరొక రకంగా  చూస్తే    (U I) (U I) (U I) (U U ). అంటే  మూడు 'హ' గణాల మీద 'గగ' అన్నమాట.   ఇలా ఉండటంలో ఒక చమత్కారం ఉంది. వీలైతే‌ త్రిస్రగతిలో కూడా బండి నడిపించవచ్చును!

శ్రీ చింతారామకృష్ణారావుగారి ఆంధ్రామృతం  బ్లాగులో ఒకచోట దేవగుప్తాపు సూర్య గణపతి రావు గారు వ్రాసిన సింహరేఖావృత్తం ఒకటి కనిపిస్తోంది.

      రామ రామా రామ రారా
      రామ రా మా రామ రారా
      రామ రా గారామ రారా
      రామ రా శ్రీ రామ రారా.

ఇందులో‌ పద్యాన్ని మొత్తంగా కొద్ది అక్షరాలతో నిర్మించటం‌ ఒక సంగతి ఐతే అది గోమూత్రికా బంధం అనే చిత్రకవిత కావటం‌ మరొక విశేషం. మీకు ఆసక్తి ఉంటే, పైన చెప్పిన కవిగారి పద్యం‌ ఉన్న లింకుకు వెళ్ళి ఆ గోమూత్రికా బంధం కథా కమామిషూ ఏమిటో‌ ఒకసారి చూడవచ్చును.

ఇంక నేను పైన చెప్పిన పద్యం విషయం.  చిన్నపద్యంలో‌ రాముడి మూర్తిని సాక్షాత్కరింప జేసుకోవటానికి ప్రయత్నం. ఎంతవరకూ‌ ఫలించిందో చదువరులే చెప్పాలి మరి. సంస్కృతపదాలు దండిగానే ఉన్నా సాధారణంగా అవన్నీ అందరికీ సుపరిచితమైన పదాలే‌ కావటం వలన ఈ‌ పద్యం సుబోధకంగానే ఉంటుందని అనుకుంటున్నాను.

ఇలాంటి చిట్టిపొట్టి పద్యాలను సులువుగానే సాధన చేయవచ్చునేమో వీలైతే మీరూ‌ ప్రయత్నించండి.