అత్యష్టి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
అత్యష్టి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

9, ఆగస్టు 2020, ఆదివారం

శిఖరిణి

శిఖరిణి.
ధనాశన్ భూలోకంబున శుభదమౌ ధర్మము నెడన్
మనుష్యు ల్నిత్యంబున్ విముఖులగుచున్ మానక సదా
ఘనంబుల్పాపంబుల్ సలుపుదురయా కావగదవే
మనశ్చాంచల్యంబుల్ రఘుపతి వెసన్ మాన్పి కృపతో 



ఈ శిఖరిణవృత్తం కొంచెం‌గడ్డు పద్యమే అని చెప్పాలి. దీనిలో  గురువులూ లఘువులూ గుంపులుగా వచ్చేస్తాయి మరి. ఈ వృత్తం‌గణవిభజన  య - మ - న - స - భ - వ  అని. అంటే మొత్తం 17 అక్షరాలు.  యతిస్థానం 13వ అక్షరం. ఈ శిఖరిణీవృత్తంలో పాదానికి గురులఘువుల అమరిక ఇలా ఉంటుంది:

    I U U   U U U   I I I   I I U   U I I   I U
     
చూసారా? ఈ వృత్తంలో మొదట్లోనే ఐదుగురువులు వరసగా వస్తాయి. ఆ కష్టం చాల దన్నట్లు అ వెంటనే వరసపెట్టి ఐదు లఘువులు వస్తాయి.

సంస్కృతంలో ఐతే ఈ వృత్తంలో బండి లాగించెయ్యవచ్చునూ అనటానికి శంకరాచార్యులవారే సాక్షి. వారి అమోఘమూ అద్వితీయమూ ఐన సౌందర్యలహరీస్తోత్రం పూర్తిగా శిఖరిణీవృత్తాల్లోనే‌ ఉంది.

తెలుగులో‌ మాత్రం శిఖరిణీ స్తోత్రం వ్రాయటం కత్తిమీదసాము అనే చెప్పాలి.

అందుకనే తెలుగు కవులుశిఖరిణీ‌వృత్తాన్ని ఆదరించినట్లు కనిపించటం లేదు.

పండిత నేమాని సన్యాసిరావుగారి అధ్యాత్మ రామాయణము గ్రంథంలో నుండి ఒక శిఖరిణి

నమస్తే సోమాయ త్రిభువన శరణ్యాయచ నమో
నమస్తే రుద్రాయ త్రిదశనుత విజ్ఞాన నిధయే
నమస్తే శర్వాయ ప్రమథ గణ వంద్యాయచ నమో
నమస్తే తామ్రాయ శ్రిత భవ భయఘ్నాయచ నమః

ఐతే తెలుగు గ్రంథంలోని ఒక సంస్కృతవృత్తమే‌ కాని ఇది తెలుగుపద్యం కాదు.  యతిప్రాసలను పాటించి తెలుగుపద్యం అనిపించుకోవటమే ఇక్కడ జరిగింది.

మన ప్రబంధకవులెవరైనా శిఖరిణీవృత్తాన్ని వాడారా అన్నది అనుమానమే.

ఆధునికకాలంలో ఈ శిఖరిణీ వృత్తాన్ని గురించిన చిన్న ప్రయత్నం ఒకటి శంకరాభరణం బ్లాగులో జరిగింది. దాని వివరాలు ఇక్కడ విశేష వృత్తము - 25 (శిఖరిణి) అన్న టపాలో చూడవచ్చును. అ ప్రయత్నంలో భాగంగా శ్రీశంకరయ్యగారి శిఖరిణీ వృత్తాన్ని ఎత్తి చూపుతున్నాను:

     పురారాతీ! శూలీ! మునిజననుతా! మోక్షఫలదా!
     స్మరద్వేషీ! భర్గా! శశిధర! హరా! మాధవసఖా!
     సురూపా! సర్వజ్ఞా! సుబల! శుభదా! శోకదహనా!
     పరాకేలా? స్వామీ! పతితుఁడను, కాపాడుము శివా! 

ఈ ప్రయత్నంలో శంకరయ్యగారు సఫలీకృతులనే చెప్పాలి.  సంబోధనాప్రథమా విభక్తి ద్వారా వచ్చిన దీర్ఘాక్షరాలు బాగానే సహాయ పడటాన్ని మనం గమనించవచ్చును. ఇంకెవరన్నా శిఖరిణీ వృత్తాలుప్రయత్నించారేమో తెలియదు.

5, ఆగస్టు 2020, బుధవారం

త్వరితగతి / పాలాశదళం

త్వరితగతి.
హరియనుచు తనసుతుని
    యత డెఱుగ కోహో
నరవిభుడు దశరథుడు
    నరవరుని దామో
దరుని నిను గనుచు
    సతతమును కడు ప్రేమన్
మురిసెనట యతని
    సుఖమునకు మితి యున్నే


ఈ వృత్తానికి పాదానికి 15లఘువులూ చివరన 2 గురువులూ ఉంటాయి. అంటే పాదం నిడివి 17 అక్షరాలు. ఈ త్వరితగతి వృత్తానికి  సాంప్రదాయికంగా చేసే మూడేసి అక్షరాల గణాల విభజన అంతగా నప్పదు.  అందుచేత 7 నగణాల మీద 2 గురువులు అని చెప్పరాదు.  అలా చెప్పినపుడు పద్యం నడక తెలియదు. నడకను సూచించేలా, దీని గణవిభజనని ఇలా చెప్పటం బాగుంటుంది:

  I  I  I  I  I  -  I  I  I  I  I  -  I  I  I  I  I  -  U  U 

ఇలా ఐతే ఈ పద్యం నడకని తెలుసుకోవటం సులభం. సరిగా నడిపిస్తే ఇది  తకిట-తక, తకిట-తక, తకిట-తక, తైతై అన్నట్లుగా నడుస్తుంది. లేదా తక-తకిట తక-తకిట తక-తకిట తైతై అన్నట్లు నడుస్తుంది.

వీలైనంతవరకు పద్యం అంతా అన్నిపాదాల్లోనూ పై రెండింటిలో ఒకే విధమైన నడకను చూపితే బాగుంటుంది. కనీసం పాదం ఒక ప్రమాణంగా ఒకే‌ నడకతో‌ ఉండటం మంచిది.

వీలైనంతవరకు ఏఖండానికి ఆఖండంగా పదాలు విరిగితే ఈవృత్తానికి నడక బాగా వస్తుంది. ఐతే అలా పద్యం అంతటా సాధ్యపడవచ్చును పడకపోవచ్చును. సాధ్యపడితే చాలా బాగుంటుంది.

యతిస్థానం 11వ అక్షరం.  అంటే మూడవఖండం యతిమైత్రితో‌ ప్రారంభం కావాలి అన్నమాట.

వృత్తం కదా,  ప్రాసనియమం తప్పదు.

అన్నట్లు, ఈ త్వరితగతి వృత్తానికి 'పాలాశదళం' అన్న మరొకపేరు కూడా ఉంది.