హేమరూపము.
ప్రేమతో పల్కుచుందువే
కామితం బిచ్చుచుందువే
రామ యీ మౌన మేలరా
స్వామి నా కేది దారిరా
ఈహేమరూపవృత్తానికి పాదానికి 8 అక్షరాలుంటాయి. గురులఘుక్రమం UIUUIUIU. గణ విభజన ర-ర-వ అవుతుంది. చాదస్తులు కాని వారు ఈ గురులఘుక్రమాన్ని ర-వ-ర అని కూడా చూడవచ్చును. ఇదికొంచెం వికటకవి లాంటిది అనిపిస్తోది కదా. కావలస్తే హ-గణంతో మొదలు పెట్టి హ-త-ర అనీ చూడవచ్చును. ఇన్ని రకాలుగా చూడటం ఎందుకూ? అంత అవసరమా అనవచ్చును కొందరు. ఈ దృష్టికోణం అన్నది పద్యం లయను పట్టుకొనేక్రమంలొ అవసరం కావచ్చును. ఈ వృత్తానికే అని కాదు. ఇతర వృత్తాలకూ ఈ దృక్కోణం నుండి ఆలోచించటం చక్కగా ఉపకరిస్తుంది. నిజానికి పద్యం యొక్క లయను గురులఘువుల అమరికను గుంపులుగా విడదీయటం ద్వారా చూస్తున్నాం అన్నప్పుడు గణాలుగా చూడవలసిన అవసరమే లేదు.
ఇప్పుడు ఉదాహరణకు ఇచ్చిన పద్యాన్ని చూదాం.
ప్రేమ - తో పల్కు - చుందువే
కామి - తం బిచ్చు - చుందువే
రామ - యీ మౌన - మేలరా
స్వామి - నా కేది - దారిరా
ఇదే ఉదాహరణను ఇలాగు చూసినా బాగానే ఉంటుంది.
ప్రేమతో- పల్కు - చుందువే
కామితం - బిచ్చు - చుందువే
రామ యీ - మౌన -మేలరా
స్వామి నా - కేది -దారిరా
ఈరెండు రకాల నడకల్లో పోలిక ఉన్నా తగినంత భేదమూ ఉందని గమనించ వచ్చును.
ఐతే ఈపద్యాన్ని సంప్రదాయికమైన గణవిభజనను తీసుకొని ఆ ర-ర-వ ఆధారంగా గతిని చూడగలమా చూదాం.
ప్రేమతో -పల్కుచుం - దువే
కామితం -బిచ్చుచుం - దువే
రామ యీ - మౌన మే - లరా
స్వామి నా - కేది దా - రిరా
ఇక్కడ నడక సరిగా కుదిరినట్లు అనిపించటం లేదు నాకు. కా
అందుచేత గణవిభజన అన్నది మరీ అంత ముఖ్యమైన సంగతి కాదు. ముఖ్యమైనది గురులఘుక్రమం. అది నోటికి అనువు కాదు కాబట్టి గణవిభజన ద్వారా గుర్తుపెట్టుకోవటం. అంతే కాని ఆ గణవిభజన పద్యం లయను చూపాలన్న నియమం లేదు. ఈ సంగతి బాగా గుర్తుపెట్టుకోవాలి.
ఈ హేమరూపానికి చుట్టాల సంగతి. దీనికి ఒక డజను సంఖ్యలోఉందది. ఈ పద్యపాదం ముందు హ-గణం చేరితే అది కర్ణపాలిక, ర-గణం చేరితే అది గహ్వరం, న-గణం చేరితే కనకమంజరి, భ-గణం చేరితే అది వారయాత్రికం. ఇంకా కొన్ని చుట్టరికాలున్నాయి కాని ఇవి చాలు.
పూర్వకవులు ఎవరన్నా ఈ హేమరూపవృత్తాన్ని వాడారా అన్నది తెలియదు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి