28, ఆగస్టు 2020, శుక్రవారం

పంచశిఖ

పంచశిఖ.
ధరణీతనయాకామా
పురుషోత్తమ నిష్కామా
పరమాత్మ పరంధామా
పరిపాలయమాం రామా


పంచశిఖ అనుష్టుప్పు ఛందస్సుకు చెందిన వృత్తాల్లో 28వది. దీని గురులఘుక్రమం IIUIIUUU. అంటే గణవిభజన స-స-గగ అన్నమాట. ఈ అనుష్టుప్పు ఛందస్సుకు చెందిన వృత్తాల్లో పాదానికి 8 అక్షరాలుంటాయి. ఈ వృత్త పాదంలోని 8 అక్షరాలకు 12 మాత్రలున్నాయి.

ఈ పంచశిఖ వృత్తాన్ని వ్రాయటం  కొంచెం కష్టం‌ కావచ్చును.

ఏదైనా వృత్తం యొక్క పాదం మొదట్లో ఉన్న గురువును రెండులఘువులుగా కాని, రెండులఘువులను ఒక గురువుగా కాని మార్చటం ద్వారా వేరే సోదరవృత్తం రావచ్చును. ఇక్కడ ఈ పంచశిఖ వృత్తానికి అలా ఏర్పడుతున్న సోదరవృత్తం పేరు వేధ(త-య-గ).

పంచశిఖ వృత్తం యొక్క గురులఘుక్రమాన్ని తమతమ గురులఘుక్రమాల్లో కలిగి యున్న వృత్తాలు కొన్నున్నాయి. అవి  ఆరభటి(భ-భ-న-జ-య-గ), ఇంద్ర(జ-జ-య-గ), ఉదరశ్రీ(స-స-మ), కృతమాల(త-జ-య-భ-గగ), క్రీడాయతన(స-స-స-త-వ), క్రీడితకటక(భ-స-స-మ-మ), క్రోశితకుశల(భ-స-స-గగ), చార్వటక(మ-భ-భ-మ-మ), ధవలకరీ(న-న-భ-మ), భాస్కర(భ-న-జ-య-భ-న-న-స-గ), భూరిశిఖ(స-స-మ-త-వ), వార్తాహరి(న-జ-య-గగ), వాసవిలాసవతి(భ-భ-భ-మ-గ), విలంబితమధ్య(మ-స-స-గగ), విష్టంభ(స-స-స-గగ), వేల్లితవేల(భ-భ-భ-మ-స-న-న-స), శృంఖలవలయిత(భ-న-న-భ-మ-న-న-జ-వ), సరమాసరణి(స-స-త-త-గగ) వృత్తాలు.

ఈ పంచశిఖ వృత్తం యొక్క గురులఘుక్రమంలో అరజస్క(జ-య), కరభిత్తు(స-స-గ), క్రీడ(య-గ), తిలక(స-స), దోల(స-గ), పంక్తి(భ-గగ), ప్రగుణ(స-గగ), వల(భ-గ), శిల(జ-వ), సింధురయ(భ-మ) వృత్తాలు అంతర్భాగంగా కనిపిస్తున్నాయి.

ఈ పంచశిఖ వృత్తం యొక్క గురులఘుక్రమంతో‌ మంచి పోలిక కలిగిన వృత్తాలు అఖని(న-జ-వ), అధీర(భ-మ-గ), అరాళి(జ-జ-వ), అర్ధకల(స-స-స), ఇంద్రఫల(భ-మ-గగ), ఉదిత(స-స-స-గ), కరశయ(న-భ-ర), కరాలి(స-స-వ), కలహ(స-భ-మ), కాండముఖి(జ-భ-భ-గ), కేర(ర-భ-భ-గ), ఖేలాఢ్య(మ-స-మ), గహన(భ-న-భ-గ), చంపకమాల(భ-మ-స-గ), చతురీహ(జ-భ-గగ), చిత్రపద(భ-భ-గగ), జర(జ-జ-జ-గ), ద్వారవహ(ర-త-య-గ), ధృతహాల(మ-భ-మ), పరిచారవతి(త-భ-భ-గ), ప్రసర(మ-స-స-గ), ఫలధర(న-న-భ-గ), మణిమధ్య(భ-మ-స), మదనోద్ధుర(భ-భ-ర), మధ్యాధార(మ-భ-మ-గ), మనోల(య-స-గగ), మౌరలిక(భ-భ-గ), రంజక(భ-స-స), వంశారోపి(య-భ-మ-గ), వర్హాతుర(త-భ-త-గ), వారవతి(స-భ-భ-గ), విద్య(త-జ-వ), విరాజికర(జ-య-గగ), విశదచ్ఛాయ(స-త-య-గ), విశ్వముఖి(భ-భ-భ-గ), వృతుముఖి(న-భ-గగ), వేధ(త-య-గ), శరగీతి(ర-స-గ), శరత్(న-భ-భ-గ), శరలీఢ(న-జ-య), సహజ(స-స-జ-గ), సురయానవతి(స-స-భ-గ), సుషమ(త-య-భ-గ), స్వనకరి(న-భ-గ).

పంచశిఖ వృత్తం పాదం మొదట హ-గణం చేరితే అది ఇంద్ర(జ-జ-య-గ) వృత్తం , మొదట స-గణం చేరితే అది విష్టంభ(స-స-స-గగ) వృత్తం , మొదట భ-గణం చేరితే అది క్రోశితకుశల(భ-స-స-గగ) వృత్తం , మొదట మ-గణం చేరితే అది విలంబితమధ్య(మ-స-స-గగ) వృత్తం , చివర గురువు చేరితే అది ఉదరశ్రీ(స-స-మ) వృత్తం

పంచశిఖ వృత్తం పాదంలో 2వ స్థానం వద్ద గురులఘువులను  గురువుగా మార్చితే అది మనోల(య-స-గగ) వృత్తం , 3వ స్థానం వద్ద గురులఘువులను  లఘువుగా మార్చితే అది రుద్రాళి(న-స-గగ) వృత్తం , 4వ స్థానం వద్ద గురులఘువులను  గురువుగా మార్చితే అది పరిధార(స-ర-గగ) వృత్తం , 5వ స్థానం వద్ద గురులఘువులను  గురువుగా మార్చితే అది యుగధారి(స-య-గగ) వృత్తం , 7వ స్థానం వద్ద గురులఘువులను  లఘువుగా మార్చితే అది కరాలి(స-స-వ) వృత్తం , 2వ స్థానం వద్ద గురులఘువులను  వ-గణంగా మార్చితే అది భారాంగి(జ-స-గగ) వృత్తం

పంచశిఖ వృత్తం పాదంలో 3వ స్థానం వద్ద  గురువు చొప్పిస్తే అది కలహ(స-భ-మ) వృత్తం , 3వ స్థానం వద్ద  గ-గ చొప్పిస్తే అది విశదచ్ఛాయ(స-త-య-గ) వృత్తం , 4వ స్థానం వద్ద  భ-గణం చొప్పిస్తే అది ఉపహితచండి(స-భ-స-గగ) వృత్తం

పంచశిఖ వృత్తం పాదంలో 3వ స్థానం వద్ద  గురువు తొలగిస్తే అది సురి(న-య-గ) వృత్తం , 4వ స్థానం వద్ద  లఘువు తొలగిస్తే అది రసధారి(స-య-గ) వృత్తం , 6వ స్థానం వద్ద  గురువు తొలగిస్తే అది కరభిత్తు(స-స-గ) వృత్తం , 1వ స్థానం వద్ద  ల-ల తొలగిస్తే అది సింధురయ(భ-మ) వృత్తం , 2వ స్థానం వద్ద  హ-గణం తొలగిస్తే అది గుణవతి(న-మ) వృత్తం , 4వ స్థానం వద్ద  ల-ల తొలగిస్తే అది అభిఖ్య(స-మ) వృత్తం

ఈ‌ పంచశిఖ నడకను చూస్తే ఇది ఆరు మాత్రల తరువాత చిన్న విరుపుతో‌కనిపిస్తున్నది. 

ధరణీతన  -  యాకామా
పురుషోత్తమ  -  నిష్కామా
పరమాత్మ ప  -  రంధామా
పరిపాలయ  -  మాం రామా 

సులభంగా చతుర్మాత్రాత్మికమైన గతితో ఇలా కూడా చాలా చక్కగా ఉన్నది.

ధరణీ  -  తనయా  -  కామా
పురుషో  -  త్తమ ని  -  ష్కామా
పరమా  -  త్మ పరం  -  ధామా
పరిపా  -  లయమాం  -  రామా

ఇలా చిన్న చిన్న వృత్తాలను అంత్యప్రాసలతో చెప్పటం వలన వాటికి మరింత శోభ వస్తుంది.

పంచశిఖా వృత్తానికి పూర్వకవి ప్రయోగా లున్నట్లు కనరాదు.

 


వేధ

వేధ.
నీ వాడనురా రామా
గోవింద సదానందా
రావయ్య మహారాజా
సేవింతునురా  నిన్నే


వేధ ఉష్ణిక్కు ఛందస్సుకు చెందిన వృత్తాల్లో 13వది. దీని గురులఘుక్రమం UUIIUUU. అంటే గణవిభజన త-య-గ అన్నమాట. ఈ ఉష్ణిక్కు ఛందస్సుకు చెందిన వృత్తాల్లో పాదానికి 7 అక్షరాలుంటాయి. ఈ వృత్త పాదంలోని 7 అక్షరాలకు 12 మాత్రలున్నాయి.

ఈ వేధ వృత్తాన్ని వ్రాయటం  కొంచెం కష్టం‌ కావచ్చును.

ఏదైనా వృత్తం యొక్క పాదం మొదట్లో ఉన్న గురువును రెండులఘువులుగా కాని, రెండులఘువులను ఒక గురువుగా కాని మార్చటం ద్వారా వేరే సోదరవృత్తం రావచ్చును. ఇక్కడ ఈ వేధ వృత్తానికి అలా ఏర్పడుతున్న సోదరవృత్తం పేరు పంచశిఖ(స-స-గగ).

వేధ వృత్తం యొక్క గురులఘుక్రమాన్ని తమతమ గురులఘుక్రమాల్లో కలిగి యున్న వృత్తాలు కొన్నున్నాయి. అవి  అంతర్వనిత(మ-స-మ-గగ), అలోల(మ-స-మ-భ-గగ), కందవినోద(భ-మ-స-గగ), కలహ(స-భ-మ), ఖేలాఢ్య(మ-స-మ), గ్రావాస్తరణ(మ-భ-స-భ-మ-భ-గ), జననిధివేల(న-య-స-మ-స), తనుకిలకించిత(మ-మ-మ-న-జ-న-త-య-గగ), ద్వారవహ(ర-త-య-గ), ధీరధ్వాన(మ-మ-మ-స-గగ), ధృతహాల(మ-భ-మ), నాసాభరణ(త-య-భ-త-వ), నిష్కలకంఠి(భ-మ-స-త-య-స-భ-గ), పరిధానీయ(న-న-భ-త-జ-య-స-గగ), ప్రపన్నపానీయ(త-య-త-ర-గగ), బహులాభ్ర(స-భ-స-భ-మ), భాజనశీల(త-య-ర-ర-గ), మంజీర(మ-మ-భ-మ-స-మ), మణిమాల(త-య-త-య), మత్తాళి(మ-త-య-మ), మధ్యాధార(మ-భ-మ-గ), మనోల(య-స-గగ), మేఘధ్వనిపూర(త-య-మ-గగ), రతిరేఖ(త-య-భ-భ-గగ), లీలారత్న(మ-మ-స-మ), వంశారోపి(య-భ-మ-గ), వంశోత్తంస(త-య-స-మ-గగ), వజ్రాళి(త-య-మ-మ-మ), వాణీవాణి(మ-భ-స-భ-త-య-గగ), వాసకలీల(భ-మ-స-త-య-భ-మ-గ), విధురవిరహిత(స-త-య-భ-న-వ), విభ(న-య-త-య-గ), విశదచ్ఛాయ(స-త-య-గ), శంభు(స-త-య-భ-మ-మ-గ), శీర్షవిరహిత(త-య-భ-భ-స), సంసృతశోభాసార(స-త-య-గగ), సుషమా(త-య-భ-గ) వృత్తాలు.వీటిలో వేధ వృత్తం యొక్క గురులఘుక్రమాన్ని తమతమ గురులఘుక్రమాల్లో ఒకసారి కన్న ఎక్కువగా కలిగి యున్న వృత్తాలు  వాసకలీల(భ-మ-స-త-య-భ-మ-గ).

ఈ వేధ వృత్తం యొక్క గురులఘుక్రమంలో కణిక(త-వ), క్రీడ(య-గ), తనుమధ్య(త-య), దోల(స-గ), పంక్తి(భ-గగ), ప్రగుణ(స-గగ), వల(భ-గ), సింధురయ(భ-మ) వృత్తాలు అంతర్భాగంగా కనిపిస్తున్నాయి.

ఈ వేధ వృత్తం యొక్క గురులఘుక్రమంతో‌ మంచి పోలిక కలిగిన వృత్తాలు అతిమోహ(స-భ-గగ), అధికార(స-భ-గ), అధీర(భ-మ-గ), అభిఖ్య(స-మ), అరజస్క(జ-య), ఇంద్రఫల(భ-మ-గగ), కరభిత్తు(స-స-గ), కల్పముఖి(భ-త-గ), కిణప(భ-య-గ), కేశవతి(య-భ-గ), కౌచమార(స-త-గగ), గుణవతి(న-మ), గోపావేది(న-మ-గగ), చతురీహ(జ-భ-గగ), చిత్రపద(భ-భ-గగ), నిస్క(మ-స), పంచశిఖ(స-స-గగ), పాంచాలాంఘ్రి(న-య-గగ), పూర్ణ(త-జ-గ), ప్రతిసీర(మ-భ-గగ), భారాంగి(జ-స-గగ), మదలేఖ(మ-స-గ), మశగ(య-స), మహనీయ(య-స-గ), మాణవక(భ-త-వ), మాణ్డవక(న-త-వ), మాయావిని(స-త-గ), రుద్రాళి(న-స-గగ), వర్కరిత(మ-భ-గ), వాత్య(భ-య-గగ), విద్య(త-జ-వ), విరాజికర(జ-య-గగ), వృతుముఖి(న-భ-గగ), శంబూక(స-మ-గ), శరగీతి(ర-స-గ), సరఘ(స-త-వ), సారావనద(త-జ-గగ), సురి(న-య-గ), సౌరకాంత(ర-భ-గ), హోల(న-మ-గ).

వేధ వృత్తం పాదం మొదట లఘువు చేరితే అది మనోల(య-స-గగ) వృత్తం , మొదట ల-ల చేరితే అది కలహ(స-భ-మ) వృత్తం , మొదట గ-గ చేరితే అది ధృతహాల(మ-భ-మ) వృత్తం , మొదట స-గణం చేరితే అది విశదచ్ఛాయ(స-త-య-గ) వృత్తం , మొదట ర-గణం చేరితే అది ద్వారవహ(ర-త-య-గ) వృత్తం , చివర స-గణం చేరితే అది సుషమా(త-య-భ-గ) వృత్తం.

వేధ వృత్తం పాదంలో 2వ స్థానం వద్ద గురులఘువులను  లఘువుగా మార్చితే అది కిణప(భ-య-గ) వృత్తం , 3వ స్థానం వద్ద గురులఘువులను  గురువుగా మార్చితే అది ఇభభ్రాంత(మ-య-గ) వృత్తం , 4వ స్థానం వద్ద గురులఘువులను  గురువుగా మార్చితే అది నినాశయ(త-మ-గ) వృత్తం , 5వ స్థానం వద్ద గురులఘువులను  లఘువుగా మార్చితే అది స్థూల(త-స-గ) వృత్తం , 6వ స్థానం వద్ద గురులఘువులను  లఘువుగా మార్చితే అది పూర్ణ(త-జ-గ) వృత్తం , 1వ స్థానం వద్ద గురులఘువులను  ల-లగా మార్చితే అది సురి(న-య-గ) వృత్తం.

వేధ వృత్తం పాదంలో 6వ స్థానం వద్ద  లఘువు చొప్పిస్తే అది సారావనద(త-జ-గగ) వృత్తం , 3వ స్థానం వద్ద  ల-ల చొప్పిస్తే అది రంభ(త-న-మ) వృత్తం , 3వ స్థానం వద్ద  వ-గణం చొప్పిస్తే అది అయనపతాక(మ-న-మ) వృత్తం , 5వ స్థానం వద్ద  హ-గణం చొప్పిస్తే అది వైసారు(త-స-మ) వృత్తం , 3వ స్థానం వద్ద  భ-గణం చొప్పిస్తే అది హీరాంగి(మ-న-య-గ) వృత్తం.

వేధ వృత్తం పాదంలో 1వ స్థానం వద్ద  గురువు తొలగిస్తే అది సింధురయ(భ-మ) వృత్తం , 3వ స్థానం వద్ద  లఘువు తొలగిస్తే అది వభ్రు(త-మ) వృత్తం , 5వ స్థానం వద్ద  గురువు తొలగిస్తే అది తనుమధ్య(త-య) వృత్తం , 1వ స్థానం వద్ద  గ-గ తొలగిస్తే అది ప్రగుణ(స-గగ) వృత్తం , 2వ స్థానం వద్ద  వ-గణం తొలగిస్తే అది సూరిణి(ర-గగ) వృత్తం , 4వ స్థానం వద్ద  హ-గణం తొలగిస్తే అది లోల(త-గగ) వృత్తం.

ఈవృత్తం నడక చూద్దాం. ఆరేసి మాత్రల రెండు భాగాలుగా నడుస్తుంది.

నీ వాడను  -  రా రామా
గోవింద స  -  దానందా
రావయ్య మ  -  హారాజా
సేవింతును  -  రా  నిన్నే

ఐతే ఈ వృత్తం నడకను చతుర్మాత్రాత్మికంగ చూడటం‌ మరింతగా బాగుంటుంది. పాదంలోని మొత్తం 12 మాత్రలూ మూడు చతుర్మాత్రాగణాలుగా చక్కగా 

వేధ.
నీ వా  -  డనురా  -  రామా
గోవిం - ద సదా  -  నందా
రావ - య్య మహా  -  రాజా
సేవిం  -  తునురా  -  నిన్నే


వేధావృత్తానికి పూర్వకవి ప్రయోగా లున్నట్లు కనరాదు.


19, ఆగస్టు 2020, బుధవారం

కుమారలలితము

కుమారలలితము.    
సురేశహితకామా
సురారిగణభీమా  
పురారినుతనామా  
పరాకు రఘురామా


ఈ కుమారలలిత వృత్తంలో‌ పాదానికి 7 అక్షరాలే. చిట్టి వృత్తం. దీని గురులఘుక్రమం IUIIIUU. అనగా గణవిభజన జ-స-గ అని. యతిమైత్రి అవసరం లేదు కాని వృత్తం‌ కాబట్టి ప్రాసనియమం పాటించాలి.

కావ్యాలంకారచూడామణి కుమారలలితవృత్తం అని పేర్కొన్నది వేరే లక్షణం కలది ఉన్నది. ఇలాగు లక్షణ గ్రంథాలలో తరచుగా ఒకే వృత్తానికి  ఒకో గ్రంథంలో ఒకో పేరుండటమూ,  ఒకే‌ పేరుతో వివిధ గ్రంథాలలో వేరులక్షణాలతో వృత్తా లుండటమూ‌ మామూలే.

ఈ కుమారలలితానికి తగినంత బంధుగణం ఉంది. కుమారలలితం పాదం‌ చివర గురువును చేర్చిటే అది భార్గీ, రెండుగురువులను చేర్చితే అది నిర్వింధ్య, మూడు గురువులను చేర్చితే వీరాంత, నాలుగు గురువులను చేర్చితే ప్రఫుల్లకదళి,  ఉపస్థితం, గళితనాళ, విపన్నకదనం, మత్తేభమూ, శార్దూలమూ, శార్దూలలలితమూ, సంలక్ష్యలీల, వ్యాకోశకోశలం వృత్త పాదాల్లో కుమారలలిత సంతకం కనిపిస్తుంది.  మరికొన్ని లంబాక్షీ, నయమాలినీ, శలభలోల, కుబేరకటిక, మయూఖసరణి, పంకజధారిణి, రుచివర్ణ, ఇంద్రవదన  వృత్త పాదాలు ఈ కుమారలలితం సంతకంతో ముగుస్తాయి. సితస్తవక వృత్త పాదంలో  రెండు కుమారలలిత పాదాలు ఉంటాయి.

ఈ‌వృత్త‌ం‌ నడకను చూస్తే జ-సగ అన్నట్లు జ-గణం తరువాత చిన్న విరుపుతో‌ కనిపిస్తుంది. మరికొంచెం చిన్న విరుపు ఉత్తరార్ధం‌ సగంలో వస్తున్నది. ఉదాహరణ పద్యం‌ ఇలా చదువ వచ్చును. 

సురేశ - హిత - కామా
సురారి - గణ - భీమా  
పురారి - నుత - నామా  
పరాకు - రఘు - రామా


ఇలాంటి చిన్నిచిన్ని వృత్తాలకు అంత్యానుప్రాసలు బాగుంటాయి.  అన్ని పాదాలకు ఒకే విధంగా కాని, మొదటి రెండింటికీ ఒకరకంగా చివరి రెండింటికి మరొక విధంగా కాని, పాదం విడచి పాదానికి నప్పే విధంగా కాని ఎలాగైనా అంత్యానుప్రాసను కూర్చవచ్చును.

ఈ కుమారలలిత వృత్తానికి పూర్వకవి ప్రయోగాలు ఏమన్నా ఉన్నవో‌ లేవో తెలియదు.


17, ఆగస్టు 2020, సోమవారం

హేమరూపము.

హేమరూపము.
ప్రేమతో పల్కుచుందువే
కామితం బిచ్చుచుందువే
రామ యీ మౌన మేలరా
స్వామి నా కేది దారిరా


 

ఈ‌హేమరూపవృత్తానికి పాదానికి 8 అక్షరాలుంటాయి. గురులఘుక్రమం UIUUIUIU. గణ విభజన ర-ర-వ అవుతుంది. చాదస్తులు కాని వారు ఈ‌ గురులఘుక్రమాన్ని ర-వ-ర అని  కూడా చూడవచ్చును. ఇదికొంచెం వికటకవి లాంటిది అనిపిస్తోది కదా. కావలస్తే హ-గణంతో మొదలు పెట్టి హ-త-ర అనీ చూడవచ్చును. ఇన్ని రకాలుగా చూడటం ఎందుకూ? అంత అవసరమా అనవచ్చును కొందరు. ఈ దృష్టికోణం అన్నది పద్యం‌ లయను పట్టుకొనే‌క్రమంలొ అవసరం కావచ్చును. ఈ వృత్తానికే అని కాదు. ఇతర వృత్తాలకూ ఈ దృక్కోణం నుండి ఆలోచించటం‌ చక్కగా ఉపకరిస్తుంది. నిజానికి పద్యం‌ యొక్క లయను గురులఘువుల అమరికను గుంపులుగా విడదీయటం ద్వారా చూస్తున్నాం అన్నప్పుడు గణాలుగా చూడవలసిన అవసరమే లేదు.

ఇప్పుడు ఉదాహరణకు ఇచ్చిన పద్యాన్ని చూదాం. 

ప్రేమ - తో పల్కు - చుందువే
కామి - తం బిచ్చు - చుందువే
రామ - యీ మౌన - మేలరా
స్వామి - నా కేది - దారిరా


ఇదే‌ ఉదాహరణను ఇలాగు చూసినా బాగానే ఉంటుంది. 

ప్రేమతో- పల్కు - చుందువే
కామితం - బిచ్చు - చుందువే
రామ యీ -  మౌన -మేలరా
స్వామి నా  - కేది -దారిరా

ఈ‌రెండు రకాల నడకల్లో‌ పోలిక ఉన్నా తగినంత భేదమూ‌ ఉందని గమనించ వచ్చును.

ఐతే ఈ‌పద్యాన్ని  సంప్రదాయికమైన గణవిభజనను తీసుకొని ఆ ర-ర-వ ఆధారంగా గతిని చూడగలమా చూదాం.
ప్రేమతో -పల్కుచుం - దువే
కామితం -బిచ్చుచుం - దువే
రామ యీ - మౌన మే - లరా
స్వామి నా  - కేది దా - రిరా

ఇక్కడ నడక సరిగా కుదిరినట్లు అనిపించటం‌ లేదు నాకు. కా

అందుచేత గణవిభజన అన్నది మరీ‌ అంత ముఖ్యమైన సంగతి కాదు. ముఖ్యమైనది గురులఘుక్రమం. అది నోటికి అనువు కాదు కాబట్టి గణవిభజన ద్వారా గుర్తుపెట్టుకోవటం. అంతే‌ కాని ఆ గణవిభజన పద్యం‌ లయను  చూపాలన్న నియమం లేదు. ఈ సంగతి బాగా గుర్తుపెట్టుకోవాలి.

ఈ హేమరూపానికి చుట్టాల సంగతి. దీనికి ఒక డజను సంఖ్యలో‌ఉందది. ఈ పద్యపాద‌ం ముందు హ-గణం చేరితే అది కర్ణపాలిక, ర-గణం చేరితే అది గహ్వరం, న-గణం చేరితే‌ కనకమంజరి, భ-గణం చేరితే అది వారయాత్రికం.  ఇంకా కొన్ని చుట్టరికాలున్నాయి కాని ఇవి చాలు.

పూర్వకవులు ఎవరన్నా ఈ‌ హేమరూపవృత్తాన్ని వాడారా అన్నది తెలియదు.

కరాళి / కేతుమాల

కరాళి.
జయ దీనజనావనా
జయ సత్యపరాక్రమా
జయ నిత్యయశోధనా
జయ రామ జనార్దనా

ఈ‌ కరాళీవృత్తానికి కేతుమాల అని కూడా పేరుంది. దీని పాదంలో 8 అక్షరాలుంటాయి. గురులఘుక్రమం IIUIIUIU. గణవిభజన స-స-వ అని.

ఈ కరాళీ వృత్తం చుట్టాలను పలకరిద్దాం. ఒక యాభై వృత్తాలున్నాయి బంధుగణం! దీని పాదం ముందొక లఘువును చేర్చితే అది కరశయావృత్తమూ‌ అలా కాదని గురువును చేర్చితే అది మదనోధ్ధురా వృత్తం. దీని పాదం‌ ముందు వ-గం చేర్చితే అది జరా వృత్తమూ ఆ వ_గణం చివర ఉంచితే అది  సహజా వృత్తం. కరాళి పాదం చివర జ-గణం చేరితే అది జవనశాలిని, మ-గణం చేరితే అలితాగమనం, య-గణం చేరితే అది విమ.  ఈ‌కరాళి పాదం ముందు న-గణం చేరితే అది సమ్మదమాలిక, స-గణం చేరితే అది ఉపచిత్రం. ఇంకా బోలెడు చోట్ల ఈ‌కరాళీ సంతకం‌ కనిపిస్తుంది.

ఈ‌ వృత్తం‌ నడకను చూదాం. పాదంలో ఉన్నవి ఎనిమిది అక్షరాలు.  పాదం‌ మధ్యలో విరుపు కనిపిస్తోంది. ఉత్తరార్ధంలో ఆరు మాత్రలున్నాయి. పుర్వార్ధంలో ఐదే కాని కొంచెం సాగదీసి ఆరుగా పలకవచ్చును. జయ దీ..న అన్నట్లుగా. అప్పుడు మరింత కర్ణపేయంగా ఉంటుంది.

జయ దీన - జనావనా
జయ సత్య - పరాక్రమా
జయ నిత్య - యశోధనా
జయ రామ - జనార్దనా

వాంతభార

వాంతభార.
జయము భూపాలకేంద్రా
జయము కారుణ్యసాంద్రా
జయము త్రైలోక్యవంద్యా
జయము శ్రీరామచంద్రా

వాంతభార.
అభయదం రామనామం
విభవదం రామనామం
శుభకరం రామనామం
ఉభయదం రామనామం


ఈ‌వాంతభార వృత్తంలో పాదానికి 8 అక్షరాలు. గురులఘుక్రమం IIIUUIUU. అంటే గణవిభజన న-త-గగ అని. ప్రాసనియమం పాటించాలి.

ఈ వాంంతభారకు చుట్టాలను చూదాం. దీని పాదం చివర వ-గణం చేరితే అది చరపదం. ఆ చరపదం పాదం ముందు న-గణం చేరితే అది చంద్రిక. గగ-గణం చేరితే అది నిర్మేధ. పాదం ముందు న-గణం చేరితే అది పరిమళలలితం. పాదం ముందు లఘువునూ చివర గురువునూ చేర్చితే అది సురాక్షి. ఆ సురాక్షికి పాదం చివర మరొక గురువును చేర్చితే అది వికసితపద్మావళి. ఇవి కాక మరొక ఇరవై దాకా చుట్టాలున్నాయి.


ఈ వాంతభారను పూర్వకవులు ఎవరన్నా ప్రయోగించారా అన్నది తెలియదు.

ఈ వాంతభార నడకను చూదాం. పద్యపాదంలో  ఉన్న వి ఎనిమిది అక్షరాలే. నడిమికి విరుపు కనిపిస్తోంది. ఐతే చివరి అక్షరం ముందు మరొక విరుపూ నడకలో వస్తోంది. ఇలా రావటం ద్వారా పాదం మూడుఖండాలైనది. మొదటి రెండు ఖండాలలోనూ ఐదేసి మాత్రలున్నాయి. చివరి గురువును మనక్కావలసింత లాగి ఐదు మాత్రలుగా ఉఛ్ఛరించా వచ్చును.

జయము భూ - పాలకేం - ద్రా
జయము కా - రుణ్యసాం - ద్రా
జయము త్రై - లోక్యవం - ద్యా
జయము శ్రీ - రామచం - ద్రా

అభయదం - రామనా - మం
విభవదం - రామనా - మం
శుభకరం - రామనా - మం
ఉభయదం - రామనా - మం


16, ఆగస్టు 2020, ఆదివారం

రథోధ్ధతము

రథోధ్ధతము.
పంతగించి కలి బాధపెట్టినన్
చింతయన్న దెటు చెంత జేరు నా
యంతరంగవిభు డైన రాముడే
సంతతంబు సుఖశాంతులీయగన్


ఈ రథోధ్ధత వృత్తానికి పాదానికి 11 అక్షరాలు. గురులఘుక్రమం UIUIIIUIUIU. అంటే గణవిభజన  ర-న-ర-వ యతిమైత్రి స్థానం 7వ అక్షరం. ప్రాసనియమం పాటించాలి.

ఈ‌రధోధ్ధత వృత్తపాదానికి ముందొక గురువును చేర్చితే అది లలితావృత్తం అవుతుంది. ఆ గురువు బదులు రెండు లఘువులను ఉంచితే అది మంజుభాషిణీవృత్తం. ఏకంగా నాలుగు గురువులను ఉంచితే అది ప్రభద్రకం. ఈ ప్రభద్రకం పాదం చివర ఒక గురువును ఉంచితే అది వాణినీ వృత్తం, ర-గణం ఉంచితే అది నందనం అనే వృత్తం.  రథోధ్ధత పాదం‌ ముందు హ-గణం ఉంచితే అది మంజుమాలతి.

విశ్వనాథవారి రామయణకల్పవృక్షం బాలకాండ ఇష్టిఖండము నుండి

    ఱేని సంతస మెఱింగి సూతుఁడున్
    దోన వాజులను దూఁకజేయఁగన్
    బూనికన్ ఖదను పోవఁగా రథా
    స్థాని రాజు మెయిసాగ నూగుచున్ 

ఆధునికులు శ్రీ నేమాని రామజోగిసన్యాసి రావు గారి ఆథ్యాత్మ రామాయణం నుండి ఒక రథోధ్ధతం.

     వారిజాతహితవంశవర్థనా
     వారిజాక్ష శ్రితపారిజాతమా
     వారిజాతభవవందితా నమ
     స్కారమో వరద సద్గుణాకరా

ఈ రథోధ్ధత వృత్తం‌ నడక గురించి ఆలోచిద్దాం. ఈ వృత్తం పాదంలో గురులఘుక్రమం UIUIIIUIUIU అంటే మొత్తం‌16 మాత్రలున్నాయి. పాదం అర్ధభాగంలో అంటే మొదటి అరు అక్షరాలలో 8 మాత్రలూ, ద్వితీయార్ధంలో  8 మాత్రలూ ఉన్నాయి.

ఒక విధంగా చూస్తే, ఈ‌ భాగాలు రెండూ‌ కూడా 3 + 5 మాత్రల ఖండాలుగా విరుగుతాయి. యతిమైత్రి స్థానం చక్కగా రెండవ భాగం మొదటి అక్షరం‌పైన పడింది.

ఱేని - సంతస మె - ఱింగి - సూతుఁడున్
దోన - వాజులను - దూఁక - జేయఁగన్
బూని - కన్ ఖదను - పోవఁ - గా రథా
స్థాని - రాజు మెయి - సాగ -నూగుచున్

మరొక విధంగా చూస్తే పూర్వార్థంలో హ-హ-లల  ఐతే ఉత్తరార్థంలో హ-హ-గ కదా కాబట్టి ఇలా చదువ వచ్చును.
ఱేని  సంత - స మె - ఱింగి - సూతుఁ - డున్
దోన వాజు  - లను - దూఁక - జేయఁ - గన్
బూని కన్ ఖ  - దను - పోవఁ - గా ర - థా
స్థాని  రాజు - మెయి - సాగ -నూగు - చున్

ఈ విధంగా ఉదాహరణకు ఇచ్చిన పద్యం
పంత గించి - కలి  - బాధ పెట్టి  -నన్
చింత యన్న - దెటు  - చెంత జేరు - నా
యంత రంగ - విభు  - డైన రాము  - డే
సంత తంబు - సుఖ  - శాంతు లీయ - గన్

భ్రమరవిలసితము

భ్రమరవిలసితము
ఏమయ్యా యెప్పు డినకులపతీ
నామోక్షం బన్న నగుదు విటులన్
రామా నీవాడ రయము నను నా
స్వామీ కాపాడ వలయును గదా


ఈ భ్రమరవిలసిత వృత్తానికి పాదంలో 11 అక్షరాలుంటాయి. గురులఘుక్రమం UUUUIIIIIIU. అంటే గణవిభజన   మ-భ-న-వ అని. యతిమైత్రి స్థానం 6వ స్థానం. ఐతే ఇక్కడ ఆ యతిమైత్రి స్థానం ఒక గణం చివరి అక్షరం అవుతున్న దని గమనించాలి మనం. విరామస్థానం అలా ఉంది కదా అని అలా క్తమం విడదిస్తే  UUU UI - III IIU అని పరికించవచ్చును. ఎందుకనో నాకు ఆరవ అక్షరం యతిమైత్రి స్థానంగా తగదేమో అనిపిస్తున్నది. ఆలోచించాలి.

ఈ‌ భ్రమరవిలసిత వృత్తపాదం చివర మరి రెండు గురువులను చేర్చితే అది ప్రజ్ఞామూలం అవుతుంది. రెండు బదులు మూడు గురువులను అంటే మ-గణం ఉంచితే అది చూడాపీడం అవుతుంది. ఆ ప్రజ్ఞామూలం పాదం ముందొక గురువును ఉంచితే అది అసంబాధ అవుతుంది. భ్రమరవిలసిత చివర రెండు ర-గణాలను ఉంచితే అది హరిణీవృత్తం అవుతుంది. ఆ హరిణికి మరొక గురువునూ చివర చేర్చితే అది చంద్రలేఖ అవుతుంది. మరి కొద్ది వృత్తాల్లో కూడా ఈ‌ భ్రరమరవిలసిత సంతకం కనిపిస్తుంది.

ఈ‌ భ్రమరవిలసితం నడక చతురస్రగతిలో ఉంటుంది. అద్యంతాల లోని గురువులను ఒక్కొక్క కాలఖంండగా చూడాలి. మధ్యభాగం సులువుగానే చతుర్మాత్రా ప్రమాణంగా విడిపోతుంది. కానీ‌ ఇలా చేస్తే 6వ అక్షరం యతిమైత్రి స్థానం దగ్గర విరామం ఎంతమాత్రం‌ కుదరదు. అలా చూస్తే న్యాయంగా 8వ అక్షరం యతిమైత్రి స్థానంగా ఉండాలి.  

ఏ - మయ్యా - యెప్పు డి - నకులప - తీ
నా - మోక్షం - బన్న న - గుదు విటు - లన్
రా  - మా నీ - వాడ ర - యము నను - నా
స్వా - మీ కా - పాడ వ - లయును గ - దా


విశ్వనాథ వారి రామాయణకల్పవృక్షం బాలకాండము అవతారఖండము లోని  భమరవిలసిత పద్యం.

మాకందోద్యత్సుమమధుఝురిణీ
సేకంబై త్రావి సివము లెసగన్
సాకూతం బొప్ప సరససరఘా
నీకంబుల్ ఝుమ్మని రొద లురలెన్

ఈ‌ పద్యాన్ని ఎలా చదవాలీ, పై విధంగా కుదురుతుందా అంటే, భేషుగ్గా కుదురుతుంది చూడండి.

మా - కందో -ద్యత్సుమ - మధుఝురి - ణీ
సే - కంబై - త్రావి సి - వము లెస - గన్
సా - కూతం - బొప్ప స - రససర - ఘా
నీ - కంబుల్ -ఝుమ్మని -రొద లుర - లెన్

ఈ‌భ్రమరవిలసితం లయను చతుర్మాత్రాత్మికంగా మరొక విధంగా కూడా చూడ వచ్చును. దీని గురులఘుక్రమం UUUUIIIIIIU. దీన్ని UUUUIIIIIIU అని విడదీయ వచ్చును.UU - UU - IIII - IIU అని ఇలా చతుర్మాత్రల క్రమం వస్తుంది. ఉదాహరణ పద్యాన్ని ఇలా చూడవచ్చును. కానీ‌ ఇలా చేసినా యతిమైత్రి స్థానం దగ్గర విరామం ఎంతమాత్రం‌ కుదరక పోవటం అటుంచి సరైన లయ కనిపించటం లేదు.

ఏమ - య్యా యె - ప్పు డినకు - లపతీ
నామో - క్షం బ - న్న నగుదు - విటులన్
రామా - నీవా - డ రయము - నను నా
స్వామీ - కాపా - డ వలయు - ను గదా

భ్రమరవిలసితానికి గౌరీభట్ల బాలముకుందశర్మగారి పద్యం

గౌరీపుత్రాక్ష గజవదన సాం
బారుద్ధ్యుద్ధే నవ గుణ భసిత
ప్రారంభే పూజ్య లవకరుణయా
ధీరాధానంత్వతిశయ జయ భో

 

ఉపయుక్త విషయములు

గౌరీభట్ల బాలముకుందశర్మ గారి  శతఛందస్సుతో గణపతి శతకము అని ఒక లఘు కృతి ఉంది. పేరుసూచిస్తున్నట్ళే వంద పద్యాలూ వంద బిన్నమైన ఛందస్సుల్లో చెప్పబడ్డాయి.

15, ఆగస్టు 2020, శనివారం

హంసరుతము.

హంసరుతము.
శ్రీరామా యనుచు వేడన్
కారుణ్యం‌ బెసగ వాడే
ధారాళంబుగను కోర్కుల్
ధారాపాతముగ నీడా



ఈ‌హంసరుత వృత్తం పాదంలో 8 అక్షరాలుంటాయి. గురులఘుక్రమం UUUIIIUU. అంటే గణవిభజన  మ-న-గగ. ప్రాసనియమం పాటించాలి.

ఈ హంసరుతం పాదానికి చివర మరొక గురువును చేర్చితే అది అయనపతాక అవుతుంది. పాదం చివర మ-గణం చేరిస్తే అది భూరిఘటకం అవుతుంది. ఆ భూరిఘటకానికి ముందు మరొక రెండు గురువులను తగిలిస్తే అది ఉల్కాభాసం అవుతుంది. 


విశ్వనాథ వారి రామాయణకల్పవృక్షం బాలకాండము అవతారఖండములోని

హంసరుతము.
శ్రీ సంపాదితములై య
భ్యాసం బొప్పఁగ సరోజా
వాసంబై మధురవంబై
కూసెన్ మత్తకలహంసల్


ఈ హంసరుతం‌ నడకను చూస్తే ఇది మ-న-గగ అని ప్రతి గణం దగ్గరా విరుపుతో‌ కనిపిస్తోంది.


శ్రీరామా - యనుచు - వేడన్
కారుణ్యం - బెసగ - వాడే
ధారాళం - బుగను - కోర్కుల్
ధారాపా - తముగ - నీడా


మాణవకము

మాణవకము.
లోకము లేలేవు గదా
శ్రీకర రామా కృపతో
నీ‌కృపయే లేనపు డీ
లోకములే లేవు గదా


మాణవకము.
రామ సదా ప్రేమమయా
కామిత వాంఛాఫలదా
భూమిని నీభక్తులకే
బాములు లేకుండు గదా


ఈ‌మాణవక వృత్తానికి గురులఘు క్రమం UIIUUIIU. అంటే గణవిభజన భ - త - లగ. అంటే పాదానికి కేవలం 8 అక్షరాలన్నమాట. అందుచేత యతిస్థానం ఏమీ‌లేదు. ప్రాసనియమం ఉంది వృత్తం‌ కావట్టి. దీని గురులఘుక్రమాన్ని మనం UIIU - UIIU అని కూడా అనుకోవచ్చును. ఈ విధానం‌గా విడదీసి చూడటం దీని నడకకు అనుగుణమైన విభజన అవునా అన్నది ఆలోచనీయం. కాని వృత్తపాదంలో మొదటి సగమూ తదుపరి సగమూ ఒకే గురులఘుక్రమంతో ఉన్నవన్నది మాత్రం స్పష్టం అవుతున్నది కదా. త్రికగణాలతో‌ అన్నింటికీ ఒకే కొలబద్దతో లక్షణాలు వ్రాసుకోవటం వలన ఇలాంటి చిన్న పెద్దా విషయాలు మరుగున పడిపోతున్నాయి.

మాణవకవృత్త పాదానికి అదనంగా ఒక గురువును చివర ఉంచితే అది శంబరధారీవృత్తం అవుతుంది. పాదం‌ మొదట ఒక స-గణం చేర్చితే హరికాంతావృత్తమూ, భ-గణం చేర్చితే కలస్వనవంశవృత్తమూ అవుతాయి. ఆ హరికాంత చివర మరొక గురువును చేర్చితే అది కరమాల. ఆ కలస్వనవంశకు ముందు మరొక భ-గణాన్ని చేర్చితే అది  కర్ణిశర వృత్తం. ఇంకా మరొక ఇరవై చిల్లర వృత్తాలో ఈ‌మాణవకం సంతకం కనిపిస్తుంది.

ఈ వృత్తానికి తెలుగులో పూర్వకవి ప్రయోగాలు ఏమన్నా ఉన్నాయా అన్నది తెలియదు.

ఈ‌ మాణవకం‌ నడకను చూదాం. ఈ వృత్తంలో పాదానికి ఉన్నది పన్నెండు మాత్రలు. పాదం సమద్విఖండనగా విరుపుతో‌ నడుస్తుంది. ఐతే ఒక్కో ఖండంలోనూ ఆరేసి మాత్రలున్నా, అవి ఎనిమిదేసి మాత్రలుగ నడుస్తాయి! అంటే చతురస్ర గతి అన్నమాట. అదెలా అంటే పాదం అర్ధభాగాల చివర ఉన్న గురువును నాలుగు మాత్రలుగా పలకవలసి ఉంటుంది.

రామ స - దా - ప్రేమమ - యా
కామిత -వాం - ఛాఫల - దా
భూమిని - నీ - భక్తుల - కే
బాములు -లే - కుండు గ - దా


శ్రీ వల్లభ వఝుల అప్పల నరసింహమూర్తి కవి గారి మాణవక వృత్తం చూడండి.

    మా యని శ్రీ యే నయమా
    మా యన లక్ష్మీశు యమా
    యా యశు శిక్షా శయమా
    మా యశ మౌగా నియమా

ఇదొక చిత్రకవిత్వ విన్యాసం కాబట్టి పద్యం మరీ సుభగంగా ఉండకపోవటంలో వింత లేదు. ఈ పద్యమే కొద్ది మార్పుతో‌ మరొక చోట కూడా కనిపిస్తోంది.

విశ్వనాథ వారి శ్రీమద్రామాయణ కల్పవృక్షము. (Download)

 విశ్వనాథ వారి శ్రీమద్రామాయణ కల్పవృక్షము మనకు అంతర్జాలంలో లభిస్తోంది. ఇక్కడ డౌన్‌లోడ్ సూచికలు ఇస్తున్నాను.


  1. బాల కాండము
  2. అయోధ్యా కాండము 
  3. అరణ్య కాండము
  4. కిష్కింధ కాండము
  5. సుందర కాండము
  6. యుధ్ధ కాండము

ఈ‌పై పుస్తకాల్లో అరణ్య కాండము సుందర కాండము తి.తి.దే వారి సైట్‌లోనూ మిగిలిన నాలుగు కాండములూ అర్కీవ్ సైట్‌లోనూ‌ లభిస్తున్నాయి.

అసక్తి కలవారు తప్పక దిగుమతి చేసుకోండి. అంతర్జాలంలో ఈనాడు లభిస్తున్నా అవి రేపోమాపో అక్కడ ఉండకపోవచ్చును. కాబట్టి బధ్ధకిస్తే మనకే ఇబ్బంది మరి.

ప్రమాణిక

ప్రమాణిక.
ధరాసుతామనోహరా
ధరాతలాధినాథుడా
సురారిలోక కాలుడా
బిరాన రామ బ్రోవరా

ప్రమాణిక.
ధరాత్మజామనోహరా
మొరాలకింప వేమిరా
పరాకు మాని ప్రోవరా
తరింపజేయరా ప్రభూ


ఈ ప్రమాణిక వృత్తంలో‌ పాదానికి 8 అక్షరాలు. గురులఘుక్రమం  IUIUIUIU. అంటే గణవిభజన  జ-ర-లగ . యతి మైత్రి అవసరం లేదు. ప్రాసనియమం ఉంది. ఈ వృత్తాన్ని ప్రమాణి అని కూడా అంటారు.

రెండు ప్రమాణిక పాదాలు కలిపితే అది పంచచామరం అవుతుంది. ఆ పంచచామరాన్నే‌ నరాచ అనీ అంటారు. అదనంగా పాదం ముందొక లఘువును ఉంచితే అది భుజంగసంగత వృత్తం అవుతుంది, రెండు లఘువులను ఉంచితే అది  మనోరమా వృత్తం అవుతుంది. ఎడాపెడా చెరొక గురువునూ తగిలిస్తే అది మయూరసారిణీ వృత్తం అవుతుంది. పాదం చివర ఒక వ-గణం కలిపితే అది సరావికా వృత్తం అవుతుంది, రెండు వ-గణాలు కలిపితే లలామలలితాధరా వృత్తం అవుతుంది. పాదం చివర మ-గణం చేర్చితే అమోఘమాలికావృత్తం అవుతుంది. పాదం చివర జ-ర గణాలు కలిపితే కుండలికావృత్తం అవుతుంది. ఇంకా ముఫ్ఫై చిల్లర వృత్తాల్లోనూ ఈ‌ప్రామాణిక గురులఘుక్రమం కనిపిస్తుంది.

జగత్ప్రసిధ్ధమైన  గణేశ పంచరత్న స్తోత్రం ఈ‌ పంచచామర వృత్తాల్లోనే ఉంది. ఒక సారి  ఇక్కడ చదువుకోండి. ఉదాహరణకు ఒక శ్లోకం.

ముదాకరాత్తమోదకం సదావిముక్తి సాధకం
కళాధరావతంసకం విలాసిలోక రక్షకమ్
అనాయకైకనాయకం వినాశితేభదైత్యకం
నతాశుభాశునాశకమ్ నమామితం వినాయకం

నడక చూస్తే ఈ‌ప్రమాణి వృత్తం నడిమికి విరుగుతూ జగ - జగ అన్నట్లుగా ఉంటుంది. లేదా అక్కడక్కడ ఇది జ - హ - ర అన్నట్లుగా ఉంటుంది.  ఎదురు నడకతో‌ ప్రారంభం కావటమే ఈ‌ వృత్తాల్లోని ప్రత్యేకమైన అందానికి కారణం అనుకుంటాను.

ధరాసుతా - మనోహరా
ధరాతలా - ధినాథుడా
సురారి - లోక -కాలుడా
బిరాన - రామ - బ్రోవరా
 

తెలుగులో పూర్వప్రయోగాలు ఎక్కువగా ఉన్నట్లు తోచదు. అధునిక ప్రయోగం కావ్యకంఠ గణపతి ముని గారు చేసిన ఆధ్యాత్మిక సర్వోపచార పూజ ఒకటి చక్కటిది ఉన్నది. తప్పక చదవదగినది. గబ్బిట దుర్గా ప్రసాద్ గారి సరసభారతి బ్లాగులో ఆ ఆధ్యాత్మిక సర్వోపచార పూజను చదువుకొన వచ్చును.

ఇంకొకటి గుండు మధుసూదన్ గారి గణేశస్తుతి శ్లోకం చూడండి.

గజాననా! ఘనాకృతీ!
ప్రజావళీ ప్రమోద! స
ద్ద్విజ స్తుత! స్థిరా! చతు
ర్భుజా! నమో ఽస్తు తే ఽనిశమ్

ఈ‌ప్రమాణి వృత్తం నడక మహా రమణీయంగా ఉంటుంది. మీరూ‌ ప్రయత్నించండి.

లసదసు / మహి / కమల / వసన

లసదసు.
మన యెడల రాముడే
తన కృపను జూపగా
మన కభయ మీయగా
మన కిక జయంబులే


ఈ‌ లసదసు వృత్తానికి మహి, కమల, వసన అన్న పేర్లు కూడా ఉన్నాయి. దీని గురులఘుక్రమం  IIIIIUIU. అంటే గణవిభజన న-స-లగ.

ఈ‌ లసదసు బంధుగణాన్ని చూదాం. ఈ  వృత్తపాదం చివర మరొక గురువును చేర్చితే అది బింబ వృత్తం అవుతుంది. పాదం చివర ల-గ చేర్చితే అనుచాయిక, య-గణం చేర్చితే‌ పంచశాఖి, ర-గణం చేర్చితే ప్రసృమరకర అవుతుంది. ఇంకా మరొక నలభైపైన వృత్తాల్లో ఈ లసదసు గురులఘుక్రమం కనిపిస్తుంది.

ఈ‌ లసదసు యొక్క నడకను చూదాం. ఈ‌వృత్తంలో మొత్తం పది మాత్రలున్నాయి. ఉన్న రెండు గురువులూ‌ పాదం చివరకు సద్దుకున్నాయి. కాబట్టి ఐదేసి మాత్రలు ఒక ఖండంగా నడక కనవస్తోంది.

మన యెడల - రాముడే
తన కృపను - జూపగా
మన కభయ - మీయగా
మన కిక జ - యంబులే

తుంగ

తుంగ.
పరమ సఖుడ రామా
పరమ హితుడ రామా
నిరుపముడవు నిన్నే
యరసి కొనెద నాలో

తుంగ.
హరి మన సఖుడైతే
హరి మన గురుడైతే
హరి మన హితుడైతే
మరి యిక సుఖమేగా


ఈ తుంగ అనే వృత్తానికి గురులఘుక్రమం IIIIIIUU. అంటే న-న-గగ అనేది గణవిభజన అన్నమాట. ప్రాసనియమం‌ పాటించాలి. యతిమైత్రి అవసరం లేదు.

ఈ తుంగకు బంధుగణాన్ని చూదాం. పాదం చివర ఒక గురువును చేర్చితే అది భుజగశిశుభృతం అవుతుంది. పాదం ముందు రెండు లఘువులను చేర్చితే అనిమావృత్తం అవుతుంది, రెండు గురువులను చేర్చితే ఉన్నాలం అవుతుంది, గ-ల చేర్చితే  ఉపధాయా వృత్తం అవుతుంది. పాదం చివర మ-గణం చేర్చితే అది కలితకమలవిలాసం అవుతుంది, స-గణం చేర్చితే మదనయావృత్తం అవుతుంది, య-గణం చేర్చితే పరిమళలలితం అవుతుంది. పాదం చివరన కాక పాదం ముందు మ-గణం చేర్చితే అది మాత్రావృత్తం, స-గణం చేర్చితే సువృత్తి అవుతుంది. ఇవే కాక ఇంకా చాలా వృత్తాల్లో ఈ తుంగ తాలూకు గురులఘుక్రమం కనిపిస్తుంది.

ఈ‌ పద్యం నడక ఇలా ఉంది త్రిస్రగతిలో. ఇక్కడ చివర గురువులు రెండూ ఒక్కోటీ మూడేసి మాత్రలుగా పలుకుతున్నాయి.

పరమ - సఖుడ - రా - మా
పరమ - హితుడ - రా - మా
నిరుప - ముడవు - ని - న్నే
యరసి - కొనెద - నా - లో

వేరే విధంగా కూడా నడక ఉండవచ్చును. అదీ చూదాం. ఇక్కడ చతురస్ర గతిలో‌ పద్యం నడిచింది. చివరి గురువు మాత్రం అవసరార్ధం లాగి పలకాలి.

హరి మన - సఖుడై - తే
హరి మన - గురుడై -తే
హరి మన - హితుడై - తే
మరి - యిక - సుఖమే - గా

జెజ్జాల కృష్ణ మోహన రావు గారి పద్యం ఒకటి కనిపిస్తోంది ఇలా.

మనసు పిలిచెఁ గాదా
వినఁగ మనసు లేదా
దినము రజని నీవే
యినుఁడు శశియు నీవే


హరిపదము

హరిపదము.
పరమసుఖద మహో
హరినిగొలుచుటయే
నరుల కిదియె సదా
చరణమగును కదా

హరిపదము.
హరికథలు వినరే
హరికి జయ మనరే
హరికి మనసిడుటే
పరమసుఖ మనరే



ఈ హరిపదవృత్తంలో పాదానికి 8 అక్షరాలుంటాయి.  గురులఘుక్రమం IIIIIIIU. అంటే గణవిభజన  న-న-లగ అన్నమాట.  ప్రాసనియమం ఉంటుంది. యతిమైత్రి స్థానం అవసరం లేదు.

ఈ‌ హరిపదం‌ పాదం‌ ముందొక మరో లఘువును చేర్చుదాం‌ అంటే అది మదనకం అవుతుంది. రెండు లఘువులను చేర్చితే అది మకరముఖి అవుతుంది. ఏకంగా మూడు లఘువులను చేర్చితే అది దమనకవృత్తం అవుతుంది. బాబో ఇంకా లఘువు లెందుకు లెండి అంటారా, హరిపదం  పదారంభంలో ఒక గురువును చేర్చితే అది ధౌనికం అనే వృత్తం అవుతుంది.  ఒకటి చాలదంటారా, ఎడాపెడా చెరొక గురువునూ చేర్చితే అది ఉపధాయా వృత్తం అవుతుంది. హరిపదం పాదంలో గురువును ర-గణం చేస్తే అది చితిభృత వృత్తం అవుతుంది. ఆ గురువును అలాగే ఉంచి మరొక ర-గణం చేర్చితే అది గల్లకవృత్తం అవుతుంది. ఇంకా చాలానే వృత్తాల్లో ఈ హరిపదం తాలూకు గురులఘుక్రమం కనిపిస్తుంది.

ఈ‌ హరిపదం నడకను పరిశీలిద్దాం. పాదానికి తొమ్మిది మాత్రలున్నాయి. మూడేసి మాత్రలుగా నడప వచ్చును.

పరమ - సుఖద - మహో
హరిని - గొలుచు - టయే
నరుల - కిదియె - సదా
చరణ - మగును - కదా

కాని మూడేసి మాత్రలుగా కాక ఇతరత్రా కూడా నడక రావచ్చును. హరిపదానికి మరొక మాత్రను చివరన జత  కలిస్తే పది  మాత్రలు అవుతాయి. ఈ‌పది మాత్రలూ ఐదేసి మాత్రల కాలఖండాలుగా రెండుగా విరగి ఈ‌పద్యం నడుస్తుంది. కాని పరిశీలించగా ఒక్కోటి ఆరు మాత్రల కాలఖండాలుగా నడుస్తున్నది! రెండవభాగానికి ఒకటికి బదులు రెండు మాత్రలు కలుస్తున్నాయి నడకలో!

హరికథలూ - వినరే
హరికి జయా - మనరే
హరికి మనా - సిడుటే
పరమసుఖా- మనరే

ఈ‌వృత్తాన్ని నడపటంలో‌ ఉన్న చిక్కల్లా వరసగా ఏడు లఘువులు వేయవలసి రావటమే కాదు మనకు కావలసిన పదాలు ఇందులో‌ ఇమడకపోవచ్చును. అన్నీ‌ దాదాపుగా లఘువులే‌ కదా. మాటవరసకి ఇక్కడ నేరుగా రామా అందా మంటే, వరసగా రెండు గురువులు వేసే అవకాశం లేదు. పోనీ‌ రామ అందా మంటే  మాటను రెండు పాదాలమధ్యన విరచి వ్రాయవలసి ఉంటుంది. పాదోల్లంఘనం‌ చేయకుండా అది వీలు కాదు. చిన్నచిన్న పద్యాల్లో పాదోల్లంఘనం అంత బాగుండదు.

శ్రద్ధరా / సమానిక

శ్రద్ధరా
రామ నీదు భక్తుడరా
స్వామి నీకె మ్రొక్కుదురా
ప్రేమ మీఱ బ్రోవవయా
కామితార్ధ మీయవయా
 

 

ఈ శ్రధ్ధరా వృత్తానికి సమానిక అని మరొక పేరు. పాదానికి 8 అక్షరాలు. గురులఘుక్రమం UIUIUIIU. గణవిభజన ర-జ-లగ అని. పాదంలో మొత్తం 12 మాత్రలుంటాయి.

ఈ శ్రధ్ధరావృత్త పాదం ముందు రెండు లఘువులు చేర్చితే అది ప్రవాదపదవృత్తం అవుతుంది. అలాకాక పాదం చివర లగ చేర్చిటే అది వర్మితా వృత్తం అవుతుంది. ఆశ్చర్య మేమిటంటే ఇంత చిన్న గురులఘుక్రమం కేవలం ఆ రెండూ కాక ప్రపాతలికా, భస్త్రావిస్తరణం, విలాసవాసం, విరామవాటికా అనే మరొక నాలుగు వృత్తాల్లో‌ మాత్రమే‌ కనిపిస్తున్నది!

ఈ శ్రధ్దరా వృత్తం‌ నడక ప్రకారం చూస్తే UI - UI - UI - IU అన్నట్లు మూడేసి మాత్రల గణాలుగా విరుపుతో కనిపిస్తుంది.

ఉదాహరణలో ఇచ్చిన పద్యం నడక ఇలా త్రిస్రగతితో కనిపిస్తోంది.

రామ - నీదు - భక్తు - డరా
స్వామి - నీకె - మ్రొక్కు - దురా
ప్రేమ - మీఱ - బ్రోవ - వయా
కామి - తార్ధ - మీయ - వయా

చిన్నచిన్న పద్యాలను వ్రాసే టప్పుడు వీలైన విధంగా అంత్యప్రాసలను కూడా ప్రయోగిస్తే అవి మరింతగా అందగిస్తాయి.

ఈ శ్రధ్దరా పద్యం వ్రాయటం చాలా సులువు. ఔత్సాహికులు తప్పక ప్రయత్నించండి.

13, ఆగస్టు 2020, గురువారం

అనుష్టుప్ ఛందస్సులో వృత్తాలు

అనుష్టుప్ ఛందస్సులో పాదానికి 8 అక్షరాలు. ఈ ఛందస్సులో మొత్తం 28 = 256 వృత్తాలు ఏర్పడతాయి కాని తెలుగు ఛందస్సులో వృత్తపాదం చివర గురువు ఉండాలి కాబట్టి మనకు పనికివచ్చేవి 128 మాత్రమే. వీటిలో కొద్ది వృత్తాలనే లక్షణకారులు చెప్పారు.
  1. IIIIIIIU : హరిపదమ్
  2. IIIIIIUU : తుఙ్గా
  3. IIIIIUIU : లసదసు
  4. IIIIIUUU : రుద్రాలీ
  5. IIIIUIIU : అఖనిః
  6. IIIIUUUU : పాఞ్చాలాఙ్ఘ్రిః
  7. IIIUIIIU : గజగతిః
  8. IIIUIIUU : వృతుముఖీ
  9. IIIUIUIU : ఉపలినీ
  10. IIIUIUUU : కురరికా
  11. IIIUUIIU : మాణ్డవకమ్
  12. IIIUUIUU : వాంతభారః
  13. IIIUUUUU : గోపావేదీ
  14. IIUIIUIU : కరాలీ
  15. IIUIIUUU : పఞ్చశిఖా
  16. IIUIUIUU : దిగీశః
  17. IIUIUUUU : యుగధారి
  18. IIUUIIUU : అతిమోహా
  19. IIUUIUIU : శల్లకప్లుతమ్
  20. IIUUIUUU : పరిధారా
  21. IIUUUIIU : సరఘా
  22. IIUUUIUU : కౌచమారః
  23. IUIIIUUU : భార్ఙ్గీ
  24. IUIIUIIU : అరాలి
  25. IUIIUUUU : విరాజికరా
  26. IUIUIIUU : చతురీహా
  27. IUIUIUIU : ప్రమాణికా
  28. IUIUIUUU : యశస్కరీ
  29. IUIUUIUU : వారిశాలా విమాన
  30. IUIUUUUU: వితాన
  31. IUUIIUUU : మనోలా
  32. IUUIUUIU : విహావా
  33. IUUIUUUU : భూమధారీ
  34. IUUUIUUU : కులాధారీ
  35. IUUUUIUU : పారాంతచారీ
  36. IUUUUUUU : అనిర్భారః
  37. UIIIIIIU : అరి
  38. UIIIUIUU : కృష్ణగతికా
  39. UIIIUUUU : వాత్యా
  40. UIIUIIUU : చిత్రపదా
  41. UIIUUIIU : మాణవకమ్
  42. UIIUUUUU : ఇంద్రఫలా
  43. UIUIUIIU : శ్రద్ధరా సమానిక
  44. UIUIUIUU : సింహలేఖా సింహరేఖ
  45. UIUIUUUU : మౌలిమాలికా
  46. UIUUIIIU : కురుచరీ
  47. UIUUIUIU : హేమరూపమ్
  48. UUIIIIIU : ఈడా
  49. UUIIIIUU : సంధ్యా
  50. UUIIUIIU : విద్యా
  51. UUIIUIUU : సారావనదా
  52. UUIUIUIU : నారాచికా
  53. UUUIIIIU : శిఖిలిఖితా
  54. UUUIIIUU : హంసరుతమ్
  55. UUUIUIIU : హఠినీ
  56. UUUUIIUU : ప్రతిసీరా
  57. UUUUUUUU : విద్యున్మాలా
మనం వీటిని పరిశీలిద్దాం.

మధ్యా ఛందస్సులో వృత్తాలు

 మధ్యా ఛందస్సులో పాదానికి 3 అక్షరాలు. ఈ ఛందస్సులో మొత్తం 23 = 8 వృత్తాలు ఏర్పడతాయి కాని తెలుగు ఛందస్సులో వృత్తపాదం చివర గురువు ఉండాలి కాబట్టి మనకు పనికివచ్చేవి 4 మాత్రమే.

  1. IIU స: రమణ వినయము
  2. IUU య: బలకా
  3. UIU ర: మృగీ
  4. UUU మ:నారీ


మనం ఈ వృత్తాలన్నీ‌ పరిశీలిద్దాం.

ప్రతిష్ఠా ఛందస్సులో వృత్తాలు

ప్రతిష్ఠా ఛందస్సులో పాదానికి 4 అక్షరాలు. ఈ ఛందస్సులో మొత్తం 24 = 16 వృత్తాలు ఏర్పడతాయి కాని తెలుగు ఛందస్సులో వృత్తపాదం చివర గురువు ఉండాలి కాబట్టి మనకు పనికివచ్చేవి 8 మాత్రమే.

  1. IIIU న-గ: సతీ
  2. IIUU స-గ: డోలా
  3. IUIU జ-గ: కళా సుకాంతి 
  4. IUUU య-గ: క్రీడా వ్రీళ 
  5. UIIU భ-గ: వలా బింబ 
  6. UIUU ర-గ: నంద 
  7. UUIU త-గ: ధరా
  8. UUUU మ-గ: కన్యా


మనం ఈ వృత్తాలన్నీ‌ పరిశీలిద్దాం.