వృత్తాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
వృత్తాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

12, ఆగస్టు 2020, బుధవారం

కౌముది / చరపదం

 కౌముది.
 సురలకేమో సుఖావాప్తిగన్
 సురగణారిన్ సొదం బెట్టగన్
 వరలె రామావతారం బిలన్
 పరమధర్మప్రకాశంబుగన్
           (యతి 6వ స్థానం)

 కౌముది.
 దివిషదుల్ గోర శ్రీరాముడై
 భువికినే తెంచె నా వెన్నుడే
 భువనసమ్మోహనాకారుడై
 భువనసంరక్షణోద్యోగియై
          (యతి పాటించలేదు)

 కౌముది.
 అనితరం బైన దా రూపమే
 అనితరం బైన దా శౌర్యమే
 తనువునం దాల్చి తా వెన్నుడే
 మనుజుడై పుట్టె మా రాముడై
           (యతి 7వ స్థానం)





ఈ కౌముది ఒక పొట్టి వృత్తం.  పాదం నిడివి 10 అక్షరాలు. దీనికి చరపదం అని మరొక పేరు. దీని గురులఘుక్రమం IIIUUIUUIU. అంటే దీనికి గణవిభజన   న - త - త - గ .  ఇంత చిన్న వృత్తానికి యతిస్థానం అవసరం లేదని నా అభిప్రాయం. కాని లక్షణకారులు 6వ అక్షరం యతిస్థానం అని చెప్పారు. ప్రాసనియమం తప్పదు. నడక విషయం చూదాం. మనం దీనిలోని గురులఘుక్రమాన్ని నల - ర - ర అని పంచమాత్రాగణాలుగా విభజన చేయవచ్చును. బహుశః ఇదే సహజమైన గణవిభజన అనుకోవచ్చును. నడక ననననా-నాననా-నాననా అన్నట్లుగా ఉంటుందన్నమాట. ఉదాహరణలు చూదాం .

ఈ‌ కౌమిదీవృత్త పాదానికి ముందు ఒక న-గణం తగిలిస్తే అది  చంద్రికావృత్తం అవుతుంది. న-గణంతో‌ పాటుగా పాదం చివరన ఒక గురువును కూడా జతపరిస్తే అది నాందీముఖీవృత్తం అవుతుంది. కౌముది పాదం చివరన మరొ ర-గణం తగిలిస్తే అది పరివృఢం అనే వృత్తం అవుతుంది. ఆ ర-గణంతో‌ పాటు మరొక గురువును కూడా జోడిస్తే అది పరీవాహవృత్తం అవుతుంది. ఇవి కాక మరికొన్ని వృత్తాల్లో కూడా ఈ‌ కౌముది ఇమిడి ఉంది.

మొదటగా 6వ అక్షరం యతిస్థానంగా ఒక కౌముదీ పద్యం.

    సురలకేమో సుఖావాప్తిగన్
    సురగణారిన్ సొదం బెట్టగన్
    వరలె రామావతారం బిలన్
    పరమధర్మప్రకాశంబుగన్


యతినియమం వదిలి పెట్టి ఒక పద్యం.

     దివిషదుల్ గోర శ్రీరాముడై
     భువికినే తెంచె నా వెన్నుడే
     భువనసమ్మోహనాకారుడై
     భువనసంరక్షణోద్యోగియై


ఈ‌ పద్యం పంచమాత్రాగణాలతో‌ కూడిన నడకతో‌ ఉన్నది అనుకున్నాం‌ కదా. ఆ ప్రకారం విడదీసి చూపితే ఈ‌క్రింది విధంగా ఉంటుంది.  ఐదు-ఐదు మాత్రలతో‌  నడిచే తాళగతిని ఖండగతి అంటారు.

దివిషదుల్ - గోర శ్రీ - రాముడై
భువికి నే - తెంచె నా - వెన్నుడే
భువన స - మ్మోహనా - కారుడై
భువన సం - రక్షణో - ద్యోగియై

ఈ కౌముదీవృత్తానికి యతిస్థానంగా 7వ అక్షరాన్ని గ్రహించటం కూడా బాగుంటుంది. యతిస్థానం కూడా ఒక గురువు పైన వస్తుంది. ఇలా కూడా ఒక పద్యం చెప్పుకుందాం.

     అనితరం బైన దా రూపమే
     అనితరం బైన దా శౌర్యమే
     తనువునందాల్చి తా వెన్నుడే
     మనుజుడై పుట్టె మా రాముడై

యతిస్థానం 7వ అక్షరంగా విరచి చదివితే దీని నడక భిన్నంగా తమాషాగా ఉంటుంది

అనితరం - బైన - దా - రూపమే
అనితరం - బైన - దా - శౌర్యమే
తనువునం - దాల్చి - తా  - వెన్నుడై
మనుజుడై - పుట్టె  - మా - రాముడే

కొందరు  యతిస్థానం 6వ అక్షరంగా నప్పుతుందనీ మరి కొందరు 7వ అక్షరంగా నప్పుతుందనీ అభిప్రాయ పడవచ్చును. అలాగే యతిస్థానం లేకపోవటమే ఉత్తమం అనీ కొందరు అనుకోవచ్చును.  వాడంకం మీద కాని ఏ ఆలోచన సరైనది అని నిగ్గుతేలదు. 7వ స్థానంలో యతితో మంచి తూగు కనపడుతోంది - లాక్షణికం కాకపోయినా అని డా॥విష్ణునందన్ గారు అభిప్రాయం వెలిబుచ్చారు.

ఈ కౌముదీవృత్తానికి పూర్వకవుల ఉదాహరణలు ఏమన్నా ఉన్నాయా అంటే విశ్వనాథ వారు దీనిని ఉపయోగించినట్లు తెలుస్తున్నది. ఉదాహరణ సేకరించాలి.

పదమాలి

పదమాలి.
దయగల తండ్రి కృతాంతదండనా
భయమును ద్రోసి యనన్యభక్తిమై
జయజయరామ యటంచు జక్కగా
ప్రియముగ పాడు బుధాళి వేడుకన్


పదమాలి వృత్తంలో పాదానికి 12 అక్షరాలు. పాదంలో గురులఘుక్రమం IIIIUIIUIUIU. అంటే దీనికి గణవిభజన న - జ - జ - ర అని. యతిస్థానం 10వ అక్షరం.
 

ఈ పదమాలికి మాలతి అని మరొక పేరుంది. ఈ‌ పదమాలి పాదం చివర మరొక గురువును జోడిస్తే అది మృగేంద్రముఖం అనే వృత్తం అవుతుంది.  కల్పలతాపతాకినీ వృత్తపాదంలో ఈ పదమాలి చివరి పన్నెండు స్థానాలుగా ఉంది. ఈ పదమాలి మొదటి రెండులఘువులనూ తొలగిస్తే అది సహజావృత్తం అవుతుంది. వా బదులు ఒక గురువును ఉంచితే అది ఉత్పలమాలలో అంతర్భాగంగా కనిపిస్తుంది.

దీని నడక మిశ్రగతిలో వస్తుంది. మిశ్రగతి అంటే 3-4 మాత్రల గణాలు వరుసగా వస్తూ ఉండటం.

ఈ మిశ్రగతిలో పై పద్యం నడక ఇలా ఉంటుంది.


దయగల - తండ్రి - కృతాంత - దండ - నా
భయమును - ద్రోసి - యనన్య - భక్తి - మై
జయజయ - రామ - యటంచు - చక్క - గా
ప్రియముగ - పాడు - బుధాళి - వేడు - కన్


ఇక్కడ నడక 4 - 3 - 4 - 3 - 2 మాత్రలుగా కనిపిస్తోంది కదా అంటే పాదాంతంలో గురువును మనకు కావలసి వస్తే మరో రెండు మాత్రల కాలానికి పొడిగించుకోవచ్చును. అప్పుడు 4 - 3 - 4 - 3 - 4 మాత్రలుగా అవుతున్నది.  ఇలా ఉంది కాబట్టి మిశ్రగతి అన్నమాట. మిశ్రగతికి నప్పే తాళం త్రిపుటతాళం. ఇక్కడ మనకు సానుకూలాంశం యతిస్థానం తాళం మధ్యలో రావటం లేదు.  అందుచేత ఈ నడక సహజంగానే నప్పుతుందని నా విశ్వాసం.

11, ఆగస్టు 2020, మంగళవారం

ఇంద్రవంశం / ఇందువంశం

ఇంద్రవంశం.
శ్రీజానకీ‌నాథుని చేరి యుండుటే  
యీ‌జన్మసాఫల్యత యెన్న నందుచే  
నే జేయు కార్యంబుల నెల్ల భంగులన్
రాజిల్లు నా భక్తి నిరంతరంబుగన్



ఈ ఇంద్రవంశం అనే‌ వృత్తంలో‌ పాదానికి 12 అక్షరాలు. దీని గురులఘుక్రమం UUIUUIIUIUIU. అంటే గణవిభజన త - త - జ - ర అనేవి. యతిస్థానం‌  8వ అక్షరం. అంటే ఇక్కడ 'జ' గణంలో మధ్యలో ఉన్న గురువుపైన యతిస్థానం వస్తుందన్న మాట. సాధారణంగా వృత్తాల్లో యతిస్థానంలో గురువే ఉంటుంది. సాధారణంగా అనటం‌ ఎందుకంటే‌ అదేమీ‌ బండరూలు కాదు కాబట్టి.

ఈ ఇంద్రవంశానికి ఇందువంశం అని మరొక పేరు కూడా ఉంది.

ఇంద్రవంశపాదానికి ముందు ఒక లఘువును అదనంగా చేర్చితే  అది కరపల్లవోద్గత అనే వృత్తం అవుతుంది. ఇంద్రవంశం పాదారంభం లోని గురువును లఘువుగా మార్చితే అది వంశస్థవృత్తం అవుతుంది. ఆగురువునే రెండు లఘువులుగా మార్చితే అది అంబుదావళీవృత్తం. ఈ‌ ఇంద్రవంశం పాదారంభంలోని గురువును వ-గణం అంటే UI అని మార్చితే అది స్వార్ధపదావృత్తం అవుతుంది. ఇంద్రవంశం చివరి గణం ర-గణంలోని లఘువును తీసివేసి గగ అని మారిస్తే అది ఇంద్రవజ్రవృత్తం అవుతుంది.

ఈ వృత్తానికి నేమాని రామజోగి సన్యాసి రావు గారు ఒక శంకరాభరణం బ్లాగు టపాలో  ఇచ్చిన పద్యం‌

    ఇందీవరశ్యామ! నరేశ్వరేశ్వరా!
    బృందారక ప్రస్తుత విక్రమోజ్జ్వలా!
    మందస్మితాస్యాంబుజ! క్ష్మాసుతా ప్రియా!
    వందారు మందార! భవప్రణాశకా!

ఇతే ఈ‌ ఉదాహరణ పద్యం అంతా సంస్కృతం‌ కాబట్టి ఇదొక శ్లోకం తప్ప తెలుగు పద్యం‌ కాదనటం‌ వేరే విషయం.  కాని ఇందులో ఉన్నవి తత్సమాలూ వాటితో సంబోధనాప్రథమావిభక్తి ప్రయోగాలు. కాబట్టి ఇది తెలుగు పద్యం కూడా అవుతున్నది.   సరే, ఇంకొక తెలుగుపద్యం‌ కావాలంటే వారు అదే టపాలో ఇచ్చిన మరొక పద్యం చూదాం.

    దేవా! జగద్రక్షక! దీనబాంధవా!
    కైవల్య యోగప్రద! కామనాశకా!
    భావింతు నీ తత్త్వము ఫాలలోచనా!
    కావింతు నీ సేవల కంజజార్చితా!

 ఈ ఇంద్రవంశం వృత్తంలో‌వాసుదాసులు ఆంధ్రవాల్మీకి వావిలికొలను సుబ్బారావుగారి రామాయణంలోని ఒక పద్యం చూదాం.

    ధీమజ్జనుల్ మెచ్చెడి దేవరానతిన్
    నేమంబుమైఁ దీర్పఁ గ నేనుగోరిన
    ట్లీ మేలిభోగంబుల నిచ్చగింపఁ జూ
    భూమీశ నాకై యిటు పొక్క నేటికిన్

సంస్కృతంలో పాదాంతయతి ఉంది. అంటే పాదం చివరిమాట తరువాతి పాదంలోనికి ప్రవేశించకూడదు. తెలుగులో మనం‌ ప్రవాహగుణం అని చెప్పి ఆ నియమం సడలించి పారేసాం . పైని వాసుదాసు గారి పద్యంలో రెండవపాదం చివరి పదం‌ 'కోరినట్లు'. మూదవపాదం మొదటి పదం‌ 'ఈ' కోరినట్లు +‌ఈ => కోరినట్లీ అని ఐపోతుంది. ఉత్తు వెంబడే మరొక అచ్చు వస్తే‌ అంతే చచ్చినట్లుగా అని కదా తెలుగు వ్యాకరణం. సరే ఇప్పుడు పదం ఏమిటి? 'కోరినట్లీ' అని కదా. మూడవపాదం మొదట ఈ‌'ట్లీ' వచ్చి కూర్చుంది సదుపాయంగా. ఇలా తెలుగులో వీలవుతుంది కాని సంస్కృతంలో కాదు. పాదం చివరకు మాట పూర్తి ఐపోయి తీరాలి.

అలాగే సంస్కృతశ్లోకాల్లో‌ యతిస్థానం దగ్గర కొత్తపదం‌ మొదలవ్వాలి. అక్కడ మన తెలుగులో లాగా అక్షరసామ్య యతి నియమం లేదు. నేమాని వారిది శ్లోకంలా ఉన్నా అది తెలుగుపద్యమే లెండి అనుకున్నాం కదా. నాలుగవ పాదంలో‌యతిస్థానం దగ్గర లోపం‌ కనిపిస్తోంది కాని సరిగానే ఉంది - ఎందుకంటే‌ భవ అన్న పదంలో రెండవ అక్షరం దగ్గర విశ్రామం రావలసి వస్తోంది కాబట్టి సంస్కృతం ఒప్పకపోయినా తెలుగుపద్యంలో అలా అంగీకరిస్తాం కదా.

ఇక ఈ‌ఇంద్రవంశం నడకను గూర్చి కొంచెం ఆలోచిద్దాం.  నాకైతే ఇంద్రవంశం‌పాదం రెండు లేదా మూడు ఖండాలుగా నడుస్తుందని అనిపిస్తోంది.

నేమాని వారి శ్లోకం

    దేవా! జగద్ర - క్షక! దీన - బాంధవా!
    కైవల్య యోగ - ప్రద! కామ - నాశకా!
    భావింతు నీ త - త్త్వము ఫాల - లోచనా!
    కావింతు నీ సే - వల కంజ - జార్చితా!

నే నిచ్చిన పద్యం

    శ్రీజానకీ‌నా - థుని చేరి - యుండుటే
    యీ‌జన్మసాఫ - ల్యత యెన్న - నందుచే
    నే జేయు కార్యం - బుల నెల్ల - భంగులం
    రాజిల్లు నా భక్ - తి నిరంత - రంబుగన్

అలాగే వాసుదాసుగారి పద్యంలో చివరి రెండు పాదాలు చూపుతాను.

    ఈ మేలిభోగం - బుల నిచ్చ - గింపఁ జూ
    భూమీశ నాకై - యిటు పొక్క - నేటికిన్

అలాగే రెండే‌ ఖండాలుగా ఈ‌ ఇంద్రవంశం‌ నడక చూస్తే

    శ్రీజానకీ‌నాథుని  - చేరి యుండుటే
    యీ‌జన్మసాఫల్యత  - యెన్న నందుచే

 ఇలా ఉంటుంది.

ఏ పద్యాన్ని సాధన చేయాలన్నా ముందుగా దాని నడకను బాగా పరిశీలించాలి. అప్పుడు వ్రాయట‌ం తేలిక అవుతుంది.  అబ్యాసం‌ చేయగా చేయగా మంచి ధార వస్తుంది. అంతకన్న విశేషం లేదు.

చాలా మంది అపోహపడే మరొక సంగతి ఉంది. చాలా మంది భాషమీద మాంచి పట్టూ, పాండిత్యం ఉంటే కాని పద్యాలు వ్రాయటం‌ ఆసాధ్యం‌ అనుకుంటారు. పట్టు చాలు పాండిత్యం అక్కరలేదు. నేను కూడా తెలుగులో మంచి పండితుడను ఏమీ కాను.  అనేకమంది కవులకు పాండిత్యం తగినంత ఉంటుంది - ఉండాలి. కాని కవి ఉద్దండపండితుడు కావాలసిన అవసరం‌ లేదు.  తెలుగులో‌ మంచి పాండిత్యం‌ కలవారు ఉంటారు అనేక మంది ఉంటారు . కాని వాళ్ళలో పద్యాలు వ్రాయటం రాని వారే హెచ్చుమంది ఉంటారు.  అభిరుచి ఉంటే పద్యవిద్యను ఆడుతూ పాడుతూ అభ్యాసం చేయవచ్చును.

సింహగతి

సింహగతి.
రామునే తలపరాదా
ప్రేమతో పిలువరాదా 
నీ‌ మనోరథము నీయన్
స్వామి నీ కడకు రాడా
 
 సింహగతి.
 భామ  లందరును రారే
 ప్రేమ మీఱగను సీతా 
 రామచంద్రులకు వేడ్కన్
 క్షేమహారతుల నీరే



సింహగతి అనేది ఒక కొత్త వృత్తం. నా సృష్టియే. పాదానికి కేవలం 8 అక్షరాలు. దీనికి గణవిభజన ర-న-గగ. చిన్న వృత్తం‌కాబట్టి యతిస్థానం ఏమీ‌ ఉండదు. ప్రాసనియయం మాత్రం ఉంటుంది.

ఈ సింహగతి పాదం ముందు మరొక న-గణం చేర్చితే అది మదనమాలావృత్తం అవుతుంది. ఏకంగా నల-గణం అని నాలుగు లఘువులను చేర్చితే అది నయమాలినీవృత్తం అవుతుంది. పాదం ముందు న-గణమూ చివరన రెండుగురువులనూ చేర్చితే అది విపన్నకదనం అనే వృత్తం అవుతుంది. మత్తేభశార్దూలవిక్రీడీతవృత్తాల్లోనూ‌ మరికొన్నింటిలోనూ‌ ఈ సింహగతి అంతర్భాగంగా ఉంటుంది.

ఈ వృత్తానికీ‌ సింహరేఖకీ‌ చాలా దగ్గర చుట్టరికం. ఒకే ఒక అక్షరంలోనే తేడా. సింహరేఖలోని జ-గణాన్ని న-గణంగా మార్చటమే. చూడండి.

సింహరేఖ   U I U - I (U) I - U U
సింహగతి   U I U - I (I) I - U U

అంతే తేడా. కాని నడక వేరుగా వస్తుంది.  ఈ‌ సింహగతిలో సాధారణంగా  'న' గణం‌ దగ్గర విరుపు వస్తుంది. లేదా న-గణానికి పూర్వాక్షరం మీద విరుపు వస్తుంది. అలాగే చివరన ఉన్న 'గగ' పైన కూడా ఒక చిన్న విరుపు ఉందని గమనించండి.

      రామునే - తలప - రాదా
      ప్రేమతో - పిలువ - రాదా
      నీ‌ మనో - రథము - నీయన్
      స్వామి - నీ కడకు - రాడా

ఇందులో మొదటి మూడు పాదాల్లోనూ న-గణం దగ్గరా, చివరిపాదంలో తత్పూర్వాక్షరం పైనా విరుపు గమనించండి.  రెండవరకం విరుపు ప్రథానంగా ఉన్న పద్యం.

     భామ -లందరును - రారే
     ప్రేమ -మీఱగను - సీతా
     రామ - చంద్రులకు - వేడ్కన్
    క్షేమ - హారతుల - నీరే


ఈ సింహగతి వృత్తం వ్రాయట‌ం సులభం కాబట్టీ ఔత్సాహికులు తప్పకుండా ప్రయత్నించండి.

మధుమతి / స్వనకరి

మధుమతి.
పరమపూరుషు డా
హరియె రాముడుగా
ధరకు వచ్చెనయా
సురల కోరికపై

         
     
మధుమతి ఒక చిన్ని వృత్తం. పాదానికి 7 అక్షరాలు. దీని గురులఘుక్రమం IIIUIIU. పాదానికి గణాలు న-భ-గ అంతే. యతి స్థానం ఏమీ లేదు. ప్రాసనియమం మాత్రం‌ తప్పదు.

ఈ మధుమతీవృత్తానికి స్వనకరి అని మరొక పేరుంది.

ఈ‌మధుమతికి ముందొక లఘువును అదనంగా చేర్చితే అది అఖని అనే వృత్తం అవుతుంది. ముందొక లఘువుతో‌పాటు, మరొక గురువును కూడా పాదం చివర చేర్చితే అది శరలీఢావృత్తం అవుతుంది. మధుమతికి చివరన మరొక గురువును మాత్రం చేర్చితే అది మృత్యుముఖి అనే‌ వృత్తం అవుతుంది. మధుమతికి పాదం చివర లగ-గణం చేర్చితే అది కరశయావృత్తం అవుతుంది. అలా కాక మధుమతికి పాదారంభంలో హ-గణం చేర్చిటే అది రంజకవృత్తం అవుతుంది. మదుమతికి చివరన ఒక స-గణం చేరిస్తే అది శరత్ అనే వృత్తం అవుతుంది, ముందు భ-గణం చేర్చితే గహనావృత్తం అవుతుంది లేదా న-గణం చేర్చితే అది ఫలధరం అనే వృత్తం అవుతుంది.  ఈ మధుమతి నిడివి కేవలం 7 అక్షరాలే‌ కాబట్టి సవాలక్ష వృత్తాల్లో దీని గురులఘుక్రమం అంతర్భాగంగా ఉంటుంది.
 
విశ్వనాథ వారి రామాయణకల్పవృక్షం  బాలకాండ-అవతారఖండము లోని 184 పద్యం.
 
మధుమతి.
వగరు పిందెలతోఁ
జిగురుటాకులతోఁ
దొగరువన్నెలతో
మిగిలె మావిరుతుల్
 
ఈ మధుమతి నడకను చూస్తే దీని మూడేసి మాత్ర తరువాత విరుపుతో త్రిస్ర గతితో కనిపిస్తున్నది.
 
వగరు - పిందె - లతోఁ
జిగురు - టాకు - లతోఁ
దొగరు - వన్నె - లతో
మిగిలె - మావి - రుతుల్

ఇది అప్పకవి చెప్పిన మధుమతీ వృత్తం. అనంతాదులు చెప్పినది వేరే ఉంది. దానికి మదనవిలసిత అన్న పేరూ ఉంది. దాని గురులఘుక్రమం IIIIIIU. అనగా న-న-గ.
 
ఈ మధుమతీ వృత్తం మహామహా సులువు అనిపిస్తోంది కదా.  అందరూ ప్రయత్నించవచ్చును.

చంద్రవర్త్మ

చంద్రవర్త్మ.
రాము డల్పుడని రావణు డనియెన్
రామబాణమున ప్రాణము వదిలెన్
కాముకుండు నరకంబున కరిగెన్
భామతోడ రఘువల్లభు డరిగెన్



ఈ చంద్రవర్త్మ వృత్తంలో పాదానికి 12 అక్షరాలు. గురులఘుక్రమం UIUIIIUIIIIU .దీని గణవిభజన ర - న - భ - స.  యతిమైత్రి స్థానం 7వ అక్షరం.అంటే యతిమైత్రి స్థానం వద్ద పాదం సమద్విఖండితం అవుతుం దన్నమాట. ప్రాసనియమం తప్పదు.

ఇది స్వాగతవృత్తానికి సోదరి. ఎందుకంటే స్వాగతానికి గణవిభజన ర - న - భ - గగ కదా. అంటే స్వాగతంలోని చివరి 'గగ' అనే చతుర్మాత్రాగణానికి బదులుగా 'స' అనే మరొక చతుర్మాత్రాగణాన్ని పెడితే సరిపోతుంది. స్వాగతంలో చివర రెండుగురువుల్లో మొదటిదాన్ని రెండు లఘువులుగా మార్చితే చంద్రవర్త్మ అవుతుందన్న మాట. స్వాగతంలోని న-గణాన్ని లగ అని మార్చితే అన్నే మాత్రలతో, అదే‌ స్వాగతం నడకతో‌ మాధురీవృత్తం అవుతుంది. అలాగే స్వాగతంలోని భ-గణాన్ని గగ అని మార్చితే ఇంచుమించిగా అదే స్వాగతం నడకతో శ్రేయావృత్తం అవుతుంది. స్వాగతంలో మొదటి గురువును రెండు లఘువులుగా మార్చితే అదే స్వగతపు మాత్రలూ‌ నడకలతో అది ద్రుతపదవృత్తం అవుతుంది. ఇవన్నీ ఒక చిన్న గుంపు అనుకోవచ్చును.

ఈ చంద్రవర్త్మ యొక్క గురులఘుక్రమం, విషగ్వితానం అనే వృత్తంలో అంతర్భాగంగా ఉంటుంది.

ఎవరైనా పూర్వం ఈ వృత్తాన్ని వాడారా అంటే విశ్వనాథవారు వాడారు. వారి సాహిత్యం నుండి ఉదాహరణను సేకరించవలసి ఉంది.

ఈ చంద్రవర్త్మ నడక వ్యవహారం చూస్తే ఇలా వస్తుంది.

    రాము  - డల్పు - డని  - రావణు - డనియెన్
    రామ - బాణ - మున - ప్రాణము - వదిలెన్
    కాము - కుండు - నర - కంబున కరిగెన్
    భామ - తోడ - రఘు -వల్లభు - డరిగెన్
   

ద్రుతవిలంబితం

ద్రుతవిలంబితం.
ఇచటి   సౌఖ్యము లెప్పుడు గోరినా
నచటి భోగము లెప్పుడు గోరినా
నెచట రాఘవు నెప్పుడు మెత్తురే
నచట నుండెద నంతియ జాలదే

ఈ ద్రుతవిలంబిత వృత్తానికి గురులఘుక్రమం  IIIUIIUIIUIU. అంటే గణవిభజన న - భ - భ - ర. యతిస్థానం 7వ అక్షరం. పాదానికి 12అక్షరాలు కాబట్టి యతిస్థానం దగ్గర సమంగా విరుగుతున్న దన్న మాట.

ఉత్పలమాలా, చంపకమాలలకు ద్రుతవిలంబితం చాలా దగ్గరి చుట్టమేను  ఉత్పలమాలకు భ-ర-న-భ-భ-ర-వ అని కదా గణవిభజన. ఇందులో ద్రుతవిలంబితం తాలూకు గణక్రమం  న-భ-భ-ర నేరుగా కనిపిస్తూనే ఉందిగా. ఉత్పలమాలా చంపకమాలల చుట్టరికం వేరే చెప్పాలా? ఇవి కాక, ఇంకా వ్యాకోశకోశలం, సూరసూచకం అనే వృత్తాల్లో ఈ ద్రితవిలంబితం ఇమిడి కనిపిస్తూ ఉంది.

ఈ ద్రుతవిలంబిత వృత్తపాదానికి ముందు ఒక ర-గణం చేర్చితే అది నూతనం అనే వృత్తం అవుతుంది. రెండు ద్రుతవిలంబితపాదాలను ఒక జతచేస్తే అది శంబరం‌ అనే వృత్తం అవుతుంది.

ఈ ద్రుతవిలంబిత వృత్తంలో ఒక తమాషా దాగి ఉంది.  మొదట వచ్చే 'న' గణం‌ ఒక సూర్యగణం కూడా. అలాగే తరువాతి రెండూ భగణాలే కదా.  'భ' గణం‌ ఒక ఇంద్రగణం‌. చివరి గణమైన 'ర' గణం‌ ప్రక్కన ఒక లఘువు చేర్చితే? అప్పుడు 'ర' గణం  U I U అన్నది U I U I గా మారుతుంది ఇది U I - U I అని విదదీస్తే రెండు 'హ' గణాల జంట.  మరి 'హ'  ఒక సూర్యగణం. అవును కదా. ఇప్పుడు ఏతావాతా తేలింది ఏమిటీ? ఒక ద్రుతవిలంబితం పాదానికి అదనంగా ఒక లఘువు చేర్చితే అప్పుడు గణ క్రమం  సూర్యగణం - రెండు ఇంద్రగణాలూ - రెండు సూర్యగణాలు అయ్యింది. అంటే‌ ఒక తేటగీతి పాదం అన్నమాట.  ఐతే యతిస్థానం వేరుగా ఉంటుంది, ద్రుతవిలంబితానుకీ తేటగీతికీ.
కాబట్టి రెండు స్థలాలలోనూ యతిమైత్రి పాటించి వ్రాయవలసి ఉంటుంది చిత్రకవిత్వం ఇలా వ్రాసే‌ పక్షంలో.

ద్రుతవిలంబితం      III - UII - UII - UIU         న - భ - భ - ర
చివరలఘువుతో     III - UII - UII - UI  - UI     న - భ - భ - హ - హ   => సూ - ఇం - ఇం - సూ - సూ
                    

శంకరాభరణం బ్లాగులో పండిత శ్రీనేమాని రామజోగి సన్యాసి రావు గారు  ఈ‌ ద్రుతవిలంబితం పైన ఒక టపా వ్రాసారు.   ఇలా తేటగీతిలో ద్రుతవిలంబితం గర్భితం చేయవచ్చునని ఆయన అందులో ప్రస్తావించారు. ఆ టపాలో ఆయన ఇచ్చిన ద్రుతవిలంబితవృత్త పద్యం ఇదిగో

    జయము రాఘవ! సద్గుణ వైభవా!
    జయము విశ్రుత సత్య పరాక్రమా!
    జయము రాక్షస సంఘ వినాశకా!
    జయము సద్ఘన! సాధు జనావనా!

అదే చోట శ్రీ‌కంది శంకరయ్యగారి ద్రుతవిలంబిత పద్యం.

    రవికులోత్తమ! రామ! దయానిధీ!
    భవభయాపహ! భాగ్యవిధాయకా!
    భువనమోహన! మోహవినాశకా!
    శివసఖా! హరి! చేసెద నీ నుతుల్.

విశ్వనాథ వారి రామాయణకల్పవృక్షం‌ బాలకాండము ఇష్టిఖండములోని ద్రుతవిలంబితం

    మది సుమంత్రుడు మంత్రులమాట కొ
    ప్పుదల పూనునొ పూనఁడొ యన్నటుల్
    వదన మింతగ వంచి యనంతరం
    బిదియ మీదగు నిష్టమ యైనచో

ఈ‌ ద్రుతవిలంబితంలో యతిస్థానం పాదంలో సరిగ్గా మధ్యన వస్తుందని చెప్పాను కదా.  యతిస్థానం దగ్గర మాట విరిగితేనే‌ కాని ఈ‌ వృత్తానికి నడకలో అందం రాదనుకుంటాను. ఈ విషయం మరింతగా అలోచించదగ్గది.

చిత్రపదము

చిత్రపదము
రాముని నమ్మిన వాడా
నీమము దప్పని వాడా
స్వామియె తోడుగ లేడా
కామిత మీయగ రాడా


ఈ చిత్రపదం పాదానికి 8 అక్షరాలుండే చిన్న వృత్తం. గురులఘుక్రమం UIIUIIUU. అంటే దీనికి గణవిభజన భ - భ - గగ. యతిస్థానం ఏమీ లేదు, చిన్న వృత్తంకదా అందుకని.  వృత్తం కాబట్టి ప్రాసనియమం తప్పదు.

ఈ చిత్రపద వృత్తం‌ పాదానికి ముందు ఒక లఘువునీ చివర్న ఒక గురువునీ తగిలిస్తే అది ఇంద్ర వృత్తం అవుతుంది. ఈ చిత్రపదం ముందు రెండు గురువులు తగిలిస్తే అది ప్రసర వృత్తం అవుతుంది. రెండు సరిపోవండీ అని నాలుగు గురువులు తగిలిస్తారా అది కాసారక్రాంత వృత్తం అవుతుంది. అబ్బే గురువు లెందుకండీ బరువులూ అంటారా? చిత్రపదం పాదం మొదట రెండు లఘువులు తగిలించండి. అది ఉదితం అనే వృత్తం అవుతుంది. ఆపైన పాదం చివర్న ఒక గురువునూ తగిలిస్తారా అప్పుడది విష్టంభం అనే వృత్తం అవుతుంది. చిత్రపదం పాదారంభంలో‌ ఒక భ-గణం తగిలిస్తారా? అప్పుడు అది దోధక వృత్తం అవుతుంది. పోనీ‌ స-గణం తగిలిస్తారా, అప్పుడది రోధక వృత్తం అవుతుంది.  మొదటేమీ వద్దండీ అని చిత్రపదం చివర్న ఒక స-గణం తగిలిస్తారా? అప్పుడు అది కలస్వనవంశం అనే వృత్తం అవుతుంది. ఇలా చాలానే చుట్టరికాలు చూడవచ్చును దీనికి.

ఆంధ్రామృతం బ్లాగులో చిత్రపదవృత్తానికి ఉదాహరణగా కనిపించినది. కొత్తపల్లి సుందరరామయ్యగారి వసుస్వారోచిషోపాఖ్యానం కృతి చివరి పద్యం ఇలా ఉంది.

     భక్త జనావన దక్షా
     ప్రాక్తన శాసన పక్షా
     యుక్త విచారణ దీక్షా
     సక్త మహేశ్వర రక్షా

ఈ చిత్రపదం నడకను చూస్తే చివరి రెండు గురువుల ముందు కొంచెం విరుపు కనిపిస్తోంది.
ఆసక్తి కలవారు కొన్ని చిత్రపదాలు వ్రాయటానికి ప్రయత్నించండి. చిన్నపద్యం - ఆట్టే చిక్కులు లేని పద్యం.
చిన్న చిన్న పద్యాలకు అంత్యానుప్రాసలు కూర్చితే మరింత శోభిస్తాయి.

నవమాలిని / నయమాలిని

నవమాలిని.
ఇనకుల నాయకా యితరు లేలా
నను నిను కన్నుగానకను తిట్టన్
దనుజుల పైన నాదరము ధర్మం
బన నగు నట్టి వీ రసురు లేమో

     

ఈ నవమాలినీ వృత్తానికి పాదానికి 12 అక్షరాలు. దీనికి గురులఘుక్రమం IIIIUIUIIIUU.  గణవిభజన న - జ - భ - య.  యతిస్థానం 8వ అక్షరం. వృత్తం‌ కదా, ప్రాసనియమం ఉంటుంది తప్పదు.

ఈ నవమాలినీ వృత్తానికి నయమాలినీ అన్న మరొక పేరు కూడా ఉంది.

ఈ నవమాలినీ‌ వృత్తపాదానికి ముందు ఒక గురువును చేర్చితే అది మయూఖసరణి అనే మరొక వృత్తంగా మారుతుంది. అలాగే ఈ నవమాలినీ వృత్తపాదం నుండి ఆదిలఘువును తొలగిస్తే అది మదనమాల అనే మరొక వృత్తంగా మారుతుంది. ఈ నవమాలిని తొలిలఘువును IU గా మార్చితే అది రుచివర్ణ అనే వృత్తం అవుతుంది.

ఈ వృత్తంలో విశేషం ఏమిటంటే యతిస్థానంలో లఘువు ఉండటం. సాధారంగా వృత్తాల్లో యతిస్థానంలో ఒక గురువు ఉంటుంది.

పూర్వకవి ప్రయోగాలేమన్నా ఉన్నాయేమో తెలియదు.

దీని నడక చూస్తే ఇల్లా ఉంది:

      ఇనకుల - నాయకా - యితరు - లేలా
      నను నిను - కన్నుగా - నకను - తిట్టన్
      దనుజుల - పైన నా - దరము - ధర్మం
      బన నగు - నట్టి వీ - రసురు -లేమో

 వేరే‌ నడకలతో ఈ వృత్తంలో‌ పద్యం సాధ్యమా అన్నది పరిశీలనార్హమైన విషయం.

10, ఆగస్టు 2020, సోమవారం

జలదము / లవలీలత

జలదం.
పుట్టువు లేని వాడొకడు పుట్టెనయా
పుట్టెడు నెల్లవారలకు పుట్టువులే
పుట్టని మంచిదారి రఘుపుంగవుడై
యిట్టి దటంచు జూపె నటు లేగుదమా
   
రామచరిత్రముం జదువ రక్కట శ్రీ
రాముడు చెడ్డవాడనుచు రావణుపై
ప్రేమను చిల్కరించి చెలరేగెద రీ
భూమిని కొంతమంది కలి బోధితులై



ఈ జలద వృత్తానికి పాదానికి 13 అక్షరాలు.  పాదంలో గురులఘుక్రమం  UIIUIUIIIUIIU.

గణ విభజన భ - ర - న - భ - గ.  యతిస్థానం 10వ అక్షరం.

ఈ‌ జలద వృత్తం  ఉత్పలమాలకు బాగా దగ్గరి చుట్టం. ఉత్పలమాల గణాలు భ - ర - న - భ - భ - ర - వ. అంటే ఉత్పలమాలలో మొదటి 13అక్షరాలకుకుదిస్తే అది జలదం అన్నమాట.

ఈ‌జలద వృత్తానికి లవలీలత అని మరొక పేరు కూడా ఉంది.

జలదవృత్తం‌ పాదానికి ముందొక లఘువును చేర్చితే‌ అది కాకిణికా వృత్తం‌ అవుతుంది. శంబరం, సూరసూచిక అనే వృత్తాల్లో జలదవృత్త గురులఘుక్రమం అంతర్భాగంగా ఉంది ఉత్పలమాలకే‌ కాకుండా.

ఈ‌ జలదవృత్తానికి  కొక్కొండ వేంకటరత్నం పంతులుగారి ప్రయోగం.

    వేసవి నెండ నుక్కఁ గడు వెక్కసమై
    వేసరిజేసినన్ దపము విశ్వజనుల్
    వాసిగ వారి నేల హరి వచ్చెనొ నా
    భాసిలె నింగినిన్ జలదవార మహా

ఈ‌జలదం‌ నడక చూస్తే యతిస్థానం దగ్గర విరుపు కనిపిస్తోంది. అంతవరకూ ఉత్పలమల లాగా సాగుతుంది. ఆపైన రెండు త్రిమాత్రాగణాలుగా ముక్తాయింపు ఉంటుంది పాదానికి.

పుట్టువు లేని వాడొకడు - పుట్టె - నయా
పుట్టెడు నెల్లవారలకు - పుట్టు - వులే
పుట్టని మంచిదారి రఘు - పుంగ - వుడై
యిట్టి దటంచు జూపె నటు - లేగు - దమా

ఇక్కడ నేను రెండు పద్యాలను చూపాను.  రెండింటికి నడకలోనూ కొద్దిగా బేధం ఉండటం గమనించండి.  రెండు పద్యాల్లోనూ ప్రవాహగుణం చూడవచ్చును. ప్రవాహగుణం అంటే పాదంచివరి మాట తరువాతి పాదంలోనికి చొచ్చుకొని పోవటం అన్నమాట. ఇది పద్యానికి కొంత గాంభీర్యత తెస్తుందన్న అభిప్రాయం కొంత కవిలోకంలో తరచు వినబడుతుంది.  పూర్తిగా కాదు కాని అది కొంతవరకు నిజం. కాని సంస్కృతంలో మాత్రం ఏ పాదానికి ఆపాదం పూర్తికావాలి.  పాదం చివరి మాట తరువాతి పాదంలో కొనసాగటం నిషిధ్ధం. అందువల్ల సంస్కృత కవిత్వంలో గాంభీర్యానికి లోపం ఏమీ రాలేదు కదా.  తెలుగులో దీర్ఘాంతంగా ముగిసే పదాలు తక్కువ.  అందుచేత సంసృతవృత్తాలను తెలుగు భాషలో పద్యాలుగా వ్రాసేటప్పుడు పాదోల్లంఘనాన్ని అనుమతించక తప్పదు.  లేకపోతే విడివిడిగా పద్యాలు కుదురుతాయేమో కాని కథాకథనానికి పద్యాలు సహకరించక ఇబ్బంది కావచ్చును.

మణిరంగం

మణిరంగం.      
శ్యామలాంగ వియచ్చరపూజ్యా
రామచంద్ర సురారివిరోధీ     
నామనంబున నమ్మితి నయ్యా
ప్రేమ నేలవె వేదసువేద్యా


ఈ మణిరంగం మరొక పొట్టి వృత్తం. పాదానికి 10 అక్షరాలు. దీనికి గురులఘుక్రమం UIUIIUIIUU.  గణవిభజన ర - స - స - గ . యతిస్థానం 6వ అక్షరం. వృత్తం‌ కాబట్టి ప్రాసనియమం ఉంది.

నడక ప్రకారం దీని  గురులఘుక్రమం UIUII - UIIUU అన్నట్లు ఉంటుంది.  సరిగా యతిస్థానం దగ్గర ఖండనతో. పాదంలో ఉన్నవి 14 మాత్రలు. సరిగా 7 మాత్రల తరువాత పాదం విరుగుతుం దన్నమాట సమంగా.
ఉదాహరణకు నా పద్యాన్ని ఇలా నడక ప్రకారం విరచి చూపవచ్చును.

    శ్యామ లాంగ వి - యచ్చర పూజ్యా
    రామ చంద్ర సు - రారివి రోధీ
    నామ నంబున - నమ్మితి నయ్యా
    ప్రేమ నేలవె - వేదసు వేద్యా
      
మణిరంగ వృత్తంలో నేమాని రామజోగి సన్యాసిరావు గారి శివస్తుతి పద్యం.
    పార్వతీపతి పాపవిదారా
    సర్వరక్షక సౌఖ్యవిధాతా
    శర్వ ధూర్జటి శంకర దేవా
    గర్వ నాశక కామిత మీవా      

ఇలా మణిరంగ వృత్తాలు సులువుగా వ్రాయవచ్చును. ఆసక్తి కలవారు ప్రయత్నించండి మరి.

మంజులయాన

మంజులయాన.
కనులార భవదీయ కమనీయ రూపమున్
కనుగొందు నను నాశ కడముట్ట నీకురా
తనివార నిను జూడ తగనందువా ప్రభూ
మనసెల్ల రఘురామ మరి నిండి యుండవా



ఈ మంజులయాన వృత్తంలో‌ పాదానికి 15 అక్షరాలుంటాయి. దీని  గురులఘుక్రమం IIUIIIUIIIUIUIU అని. పాదానికి గణవిభజన  స - న - భ - జ - ర.  యతిస్థానం 9వ అక్షరం. ఇది నడక ప్రథానమైన వృత్తం కాబట్టి గణవిభజన తదనుగుణంగా  సల - సల - సల - ర అని చెప్పుకుంటే బాగుంటుంది.

ఈ 'మంజులయాన' వృత్తం  నేను సృష్టించినది. మొదట్లో  దీనికి  పులిహోర అని పేరు పెట్టాను!  ఇది ఒక అవధానం సందర్భంగా సృజించటం జరిగింది కాకతాళీయంగా. ఆ సందర్భంగా ముందుగా ఈపద్యం లక్షణాన్ని ఒకపాదంగా  ఇవ్వటం‌ జరిగింది. అదెలా అంటే

పులిహోర పులిహోర పులిహోర మెక్కిపో

అని!

అవధాని గారి అభిప్రాయాన్ని అనుసరించి (చూడండి:  పులిహోర ఛందస్సుపై టపా) దీనికి ఇప్పుడు కొత్తగా 'మంజులయాన' అని పేరు పెట్టటం జరుగుతున్నది.

ఈ వృత్తానికి జె.కె.మోహనరావుగారి పద్యం:
    అలనాడు నలరాజు హరుసాన వండెగా
     అలనాడు బలభీము డతివేగ వండెగా
     పులిహోర యన నాల్క పొడుగాయె జూడగా
     పులిహోర పులిహోర పులిహోర మెక్కిపో

ఇందులో చివరిపాదం " పులిహోర పులిహోర పులిహోర మెక్కిపో" అనేది ఈ వృత్తలక్షణానికి ఉదాహరణగా నేను ఇచ్చినది. మోహనరావుగారు మొత్తం పద్యాన్ని పూరించా రన్నమాట.

నా కోరిక మేరకు, అవధానానంతరం అవధాని అనిల్ గారు చెప్పిన పద్యం:
     సిరి శ్యామలుడు నేడు జిగి యొప్పు చుండగా
     ధరణీ జనులు మెచ్చదగి నట్లు యిచ్చిరే
     సరసీరుహనిభాంఘ్రి చతురాస్యు పత్నికిన్
     పులిహోర యను వృత్తమును నంకితంబుగా
     
మోహన రావు గారు పరిశీలించి చెప్పినట్లుగా ఇది పూర్తిగా కొత్త గురులఘుక్రమం కలిగిన వృత్తం. తెలిసిన వృత్తాలు దేనిలోనూ ఇది అంతర్భాగం‌ కాదు.

నిజానికి తమాషాకు నేను అనుకోకుందా సృజించినది ఐనా ఈ తాళప్రథానమైన వృత్తానికి మంచి పరిథి ఉంది. అవధానిగారు అన్నట్లు ఈ వృత్తంలో పూర్తిస్థాయి కవిత్వప్రక్రియలు చేయవచ్చును.  ఉదాహరణకు ఏదైనా ఒక ఖండిక మొత్తాన్ని ఈ‌ మంజులయాన వృత్త పద్యాలతో పూర్తిగా హాయిగా నిర్మించవచ్చును.  హాయిగా చదివించగల నడక ఉందనిపిస్తోంది దీనికి.

యతిమైత్రి స్థానం వద్ద విరుపు ఇవ్వాలి. అంటే అక్కడ కొత్తపదం‌తో‌ మొదలవ్వాలి వీలైనంత వరకు. అప్పుడు వినటానికి చాలా బాగుంటుంది నడక. ముఖ్యంగా పంచమాత్రా విభజనతో నడుస్తున్నది కాబట్టి ఐదేసి మాత్రలకు కొత్తపదాలు పడటం‌ మరింత శోభిస్తుంది. 

భద్రకము / భద్రిక

భద్రకం.
రాముడా యతడు దేవుడే
ఏమి సందియము లేదులే
భూమిపై నిలుప ధర్మమున్
స్వామి తా నిలకు వచ్చెలే



ఈ‌ భద్రకం అనే చిట్టిపొట్టి వృత్తానికి గురులఘుక్రమం UIUIIIUIU. గణవిభజన  ర - న -ర. అంటే‌పాదానికి 9 అక్షరాలే అన్నమాట. అందుచేత యతిస్థానం ఉండదు. వృత్తం కాబట్టి ప్రాసనియమం ఉంటుంది.  ఈ‌ పద్యం నడక గణాంతాల్లో విరుపుతో ఉంటుంది.

ఈ భద్రకవృత్తానికి భద్రిక అనే పేరు కూడా  ఉంది.

నాకు తెలిసి పూర్వకవి ప్రయోగాలు లేవు.

పై పద్యంలో నేను సరిపాదాలకు అంత్యప్రాసను కూర్చాను.  కాని నియతంగా అంత్యప్రాసాదులు వాడవలసిన పని లేదనే అనుకుంటాను.

ఈ‌భద్రకం నడకను చూస్తే ఇది UIUIII - UIU అన్నట్లుగా ఉంది అంటే పాదాంతం లోని ర-గణం ముందు చిన్న విరుపు ఉందన్నమాట. 

రాముడా యతడు  - దేవుడే
ఏమి సందియము  - లేదులే
భూమిపై నిలుప  - ధర్మమున్
స్వామి తా నిలకు  - వచ్చెలే

భద్రకాలు వ్రాయటం సులువు గానే కనిపిస్తోంది.

వీలైతే మీరూ‌ కొన్ని భద్రకాలు వ్రాయండి.

అర్ధకళ

అర్ధకళ.
నిరవద్యగుణాభరణా
సురసేవిత శ్రీచరణా
ధరణీతనయారమణా
విరతాఖిలదైత్యగణా



ఈ చిన్నారి వృత్తానికి పాదానికి 9 అక్షరాలు. గురులఘుక్రమం IIUIIUIIU. అంటే, పాదానికి గణాలు స - స - స. యతిమైత్రి స్థానం అవసరం లేదు. ప్రాసనియమం మాత్రం తప్పదు. పై పద్యంలో అంత్యప్రాసకూడా వాడాను.

ఈ అర్ధకళ తోటకాన్నుండి పుట్టినట్టు చెప్పవచ్చును. తోటకం గణాలు స - స - స - స. వీటిలో నుండి ఒక స-గణం తగ్గిస్తే అది అర్ధకళ అవుతుంది. ఈ అర్ధకళకు ఎడాపెడా తలొక గురువునూ‌ తగిలిస్తే అది దోధక వృత్తం అవుతుంది.

ఒకటా రెండా, ఏకంగా డభై పైన వృత్తాల్లో ఈ‌అర్ధకళ ఇమిడిపోతుంది.

ఈ పద్యంలో ఉన్న పదజాలమంతా సంస్కృతమే అనుకోండి. కాని అన్నీ అందరికీ పరిచయం ఉండే పదాలే కాబట్టి సుబోధకంగానే ఉంటుందని ఆశిస్తున్నాను.

ఈ అర్ధకళ నడకను  చూస్తే 5 అక్షరాల తరువాత విరుపు కనిపిస్తోంది. అంటే  IIUII - UIIU అన్నట్లు. అంటే మాత్రాపరంగా పాదంలో సమద్విఖండనం‌ చూపుతున్నది.

నిరవద్యగు - ణాభరణా
సురసేవిత - శ్రీచరణా
ధరణీతన - యారమణా
విరతాఖిల - దైత్యగణా

జాగ్రత్తగా పరిశీలిస్తే, ఉదాహరణకు ఇచ్చిన ఈపద్యంలో రామాయణసారం సూక్షరూపంలో సాక్షాత్కరిస్తుంది.

ఖేల

 ఖేల.
శౌరీ దీనజనాధారా
ధీరా రావణసంహారా
కారుణ్యాలయ శ్రీరామా
రారా రాఘవ రాజేంద్రా

ఇది ఒక కొత్తవృత్తం. పాదానికి 8 అక్షరాలు. గురులఘుక్రమం  UUUIIUUU. ఇలా బదులు UUU-II-UUU అని చెప్తే బాగుంటుందేమో.


కాని దీని నడక చూస్తే ఇది UU - UII - UUU అని తోస్తున్నది.

ఉదాహరణలో ఇచ్చిన పద్యం‌ నడక ఇలా మనోహరంగా ఉంది.

శౌరీ - దీనజ - నాధారా
ధీరా - రావణ - సంహారా
కారు - ణ్యాలయ - శ్రీరామా
రారా - రాఘవ - రాజేంద్రా

ఈ వృత్తానికి బంధుగణం బాగానే ఉంది చూడండి. ఈ క్రింది 19 వృత్తాలూ ఖేలావృత్తానికి తల్లులన్న మాట. ఎందుకంటే వీటిలో‌ఈ ఖేలావృత్తం‌ అంతర్భాగం కాబట్టి. ఇలా సరదాగా మన వృత్తాల్లో తల్లీపిల్లా వరసలు చూడవచ్చును. తమాషా ఏమిటంటే వాసకలీలా అనే వృత్తం పాదంలో ఈఖేలా పాదం రెండుసార్లు వస్తుంది!

1 ధృతహాలా 9 U - UUUIIUUU
2 ఖేలాఢ్యమ్ 9 UUUIIUUU - U
3 ద్వారవహా 10 UI - UUUIIUUU
4 మధ్యాధారా 10 U - UUUIIUUU - U
5 వంశారోపీ 10 I - UUUIIUUU - U
6 విశదచ్ఛాయః 10 II - UUUIIUUU
7 అంతర్వనితా 11 UUUIIUUU - UUU
8 కందవినోదః 11 UII - UUUIIUUU
9 సంసృతశోభాసారః 11 II - UUUIIUUU - U
10 లీలారత్నమ్ 12 UUU - UUUIIUUU - U
11 మత్తాలీ 12 UU - UUUIIUUU - UU
12 విభా 13 IIIIU - UUUIIUUU
13 అలోలా 14 UUUIIUUU - UUIIUU
14 ధీరధ్వానమ్ 14 UUUUUU - UUUIIUUU
15 విధురవిరహితా 17 II - UUUIIUUU - IIIIIIU
16 మఞ్జీరా 18 UUUU - UUUIIUUU - IIUUUU
17 శంభుః 19 II - UUUIIUUU - IIUUUUUUU
18 నిష్కలకణ్ఠీ 22 UII - UUUIIUUU - IIUUIIUUIIU
19 వాసకలీలా 22 UII - UUUIIUUU - II - UUUIIUUU - U

ఈ ఖేలా వృత్తంలోను అద్యంతాల గురువులను రెండింటినీ తొలగిస్తే అది తనుమధ్యా వృత్తం అవుతుంది. అంటే ఖేలావృత్తం‌ తల్లి అతే తనుమధ్య దాని పిల్ల అన్నమాట. ఈ ఖేలావృత్తం‌ నుండి ఆదిగురువును తీసివేస్తే ఒక నలభై వృత్తాలదాకానూ లేదా అంత్యగురువును తీసివేస్తే మరొక నలభై వృత్తాలదాకానూ ఆ గురులఘు క్రమాన్ని కలిగి ఉంటాయి - అంటే అవి దగ్గరి చుట్టాలన్న మాట ఖేలావృత్తానికి.

9, ఆగస్టు 2020, ఆదివారం

నారి

నారి.

ఏమయ్యా

రామయ్యా

నా మోక్షం

బేమాయే


నారి అంటే వింటినారి కాదండోయ్. నారీవృత్తం. నారి అంటే సంస్కృతంలో స్త్రీ అని. 

పాదానికి 3 అక్షరాలు. పొట్టి పద్యం. వృత్తం కాబట్టి ప్రాస నియమం పాటించాలి.

గురులఘుక్రమం UUU.  అంటే ఒక్క మ-గణం మాత్రం.

వినయము

వినయము.
శరణం
కరుణా
కర దా
శరథీ

కొనియా
డును రా
ముని నా
మనసే



ఈవినయ వృత్తానికి గురులఘుక్రమం IIU.  అంటే ఒక్క స-గణం ఒక పాదంగా సరిపోతుంది. పాదానికి మూడే ఆక్షరాలు. ప్రాస మాత్రం తప్పదు వృత్తం కాబట్టి.

ఈ వినయవృత్తానికి పూర్వకవి ప్రయోగాలు ఏమన్నా ఉన్నాయేమో తెలియదు.

మృగి

మృగి.
ఏమైనా
నీమాటే
నామాటో
రామన్నా

దేవుడా
కావగా
రావె సీ
తావరా



మృగీ వృత్తానికి గురులఘుక్రమం UIU. అంటే పద్యపాదానికి మూడే అక్షరాలన్నమాట. భలే చిట్టివృత్తం. ఇంత చిన్న వృత్తానికీ ప్రాసగండం తప్పదు మరి. 

మృగము అన్న మాటకు జంతువు అని సాధారణార్ధం. లేడి అనేది విశేషించి చెప్పే‌ అర్ధం. అందుచేత మృగీ అంటే‌ ఏదైనా ఆడుజంతువు అని చెప్పటం‌ తప్పులేదు కాని ఆడులేడి అన్నది సరైన అర్ధం.

లేడు నడక ఎట్లా ఉంటుందో తెలుసుకదా. దుముకుతున్నట్లుగా ఉంటుదని వేరే చెప్పాలా. ఐతే అది అడులేడి ఐతే? ఆ దుముకుడు నడక కూడా కాస్త వయ్యారంగా ఉంటుందని ఊహించాలి. ఈ మృగీ వృత్తం నడక కూడా అలా నాలుగు దుముకులు వయ్యారంగా వేసినట్లు ఉంటుంది.

సింహరేఖ

సింహరేఖ.
రూపమా వినీలమేఘం    
చాపమా కృతాంతదండం
చూపులో కృపాప్రవాహం
తాపహారి రామతత్వం

       

ఇది భలే పొట్టివృత్తం. పాదానికి కేవలం 8 అక్షరాలే. దీనికి గణాలు ర - జ - గగ. అల్పపాదప్రమాణం కల వృత్తాల్లో యతిస్థానం ఉండదు కాబట్టి ఈ వృత్తానికి యతినియమం లేదు. వృత్తం కాబట్టి ప్రాసనియమం మాత్రం తప్పకుండా పాటించాలి.

గురులఘుక్రమం ప్రస్తారంచేస్తే (U I U) (I U I) (U U ). దీనినే‌ మరొక రకంగా  చూస్తే    (U I) (U I) (U I) (U U ). అంటే  మూడు 'హ' గణాల మీద 'గగ' అన్నమాట.   ఇలా ఉండటంలో ఒక చమత్కారం ఉంది. వీలైతే‌ త్రిస్రగతిలో కూడా బండి నడిపించవచ్చును!

శ్రీ చింతారామకృష్ణారావుగారి ఆంధ్రామృతం  బ్లాగులో ఒకచోట దేవగుప్తాపు సూర్య గణపతి రావు గారు వ్రాసిన సింహరేఖావృత్తం ఒకటి కనిపిస్తోంది.

      రామ రామా రామ రారా
      రామ రా మా రామ రారా
      రామ రా గారామ రారా
      రామ రా శ్రీ రామ రారా.

ఇందులో‌ పద్యాన్ని మొత్తంగా కొద్ది అక్షరాలతో నిర్మించటం‌ ఒక సంగతి ఐతే అది గోమూత్రికా బంధం అనే చిత్రకవిత కావటం‌ మరొక విశేషం. మీకు ఆసక్తి ఉంటే, పైన చెప్పిన కవిగారి పద్యం‌ ఉన్న లింకుకు వెళ్ళి ఆ గోమూత్రికా బంధం కథా కమామిషూ ఏమిటో‌ ఒకసారి చూడవచ్చును.

ఇంక నేను పైన చెప్పిన పద్యం విషయం.  చిన్నపద్యంలో‌ రాముడి మూర్తిని సాక్షాత్కరింప జేసుకోవటానికి ప్రయత్నం. ఎంతవరకూ‌ ఫలించిందో చదువరులే చెప్పాలి మరి. సంస్కృతపదాలు దండిగానే ఉన్నా సాధారణంగా అవన్నీ అందరికీ సుపరిచితమైన పదాలే‌ కావటం వలన ఈ‌ పద్యం సుబోధకంగానే ఉంటుందని అనుకుంటున్నాను.

ఇలాంటి చిట్టిపొట్టి పద్యాలను సులువుగానే సాధన చేయవచ్చునేమో వీలైతే మీరూ‌ ప్రయత్నించండి.

పాదపము

పాదపము.
వారినిధిల్ పొడిబారెడు దాకన్
తారలు నింగికి తప్పెడు దాకన్
వారిజమిత్రుని పంచత దాకన్
ధారుణి రామకథామృత ముండున్


ఈ పాదపం అనేది మరొక పొట్టి వృత్తం. పాదానికి 11 అక్షరాలు. దీనికి గణాలు భ - భ - భ - గగ అనేవి. యతిస్థానం 7వ అక్షరం.
ప్రబంధసాహిత్యంలో పింగళిసూరనగారి కళాపూర్ణోదయం నాలుగవ ఆశ్వాసం చివరి ఆశ్వాసాంత పద్యం చూడండి.

      మాన సుయోధన మంగళ నిత్యా
      నూన యశోధన యుజ్వల కృత్యా
      దాన సుబోధన ధర్మద కృత్యా
      దీన మహాధన దీపిత సత్యా

ఎమెస్కోవారిప్రతిలో పై పద్యాన్ని పొరపాటున తోటకము అని పేర్కొనటం జరిగింది. కాని పాదపవృత్తానికీ తోటకమనే పేరు కూడా ఉందని తెలుస్తోంది.

ఈ‌ పాదపవృత్తానికి  దోదక, తోధక , తోదక , తోటక , దోధక , తరంగక , బందు , భిత్తక అనే నామాలు కూడా ఉన్నాయట! ఒక్క వృత్తానికి ఎన్ని పేర్లో, అందులోనూ తోటక వంటి వేరే లక్షణాలు కల వృత్తాలపేర్లూ కలుపుకోవటం. అంతా నానా కంగాళీగా ఉంది వృత్త నామాల పరిస్థితి చూస్తే.

ఆధునికులు శ్రీ నేమాని సన్యాసి రావు గారి పాదపవృత్తం శంకరాభరణం బ్లాగు ప్రత్యేకవృత్తాలు-3  టపా నుండి క్రింద చూపుతున్నాను.

      శ్రీరఘునందన! చిన్మయ! రామా!
      మారుతి సేవిత! మంగళధామా!
      వీరవరేణ్య! త్రివిక్రమ! రామా!
      క్ష్మారమణా! పర గర్వ విరామా!

ఈ పాదపవృత్తంలో వ్రాసిన పై పద్యాలలో అంత్యానుప్రాసను కూర్చటం గమనించండి.

నేను ఇక్కడ వ్రాసిన పద్యాన్ని పోలిన పద్యం ప్రాచీనమైనది ఒకటి ఉంది.

     యావత్తోయధరా ధరా ధర ధరాధారాధర శ్రీధరా
     యావచ్చారుచచారుచారుచమరం చామీకరం చామరమ్
     యావద్రావణరామ రామరమణం రామాయణం శ్రూయతే
     తావద్భో భువి భోగభోగ భువనం భోగాయ భూయాద్విభో

కొంచెం పలుగురాళ్ళ పాకంలో ఉన్న ఈ పద్యం హనుమంతులవారు వ్రాసారని ప్రతీతి కల హనుమద్రామాయణం లోనిదట. ఆసక్తి కలవారు అర్థతాత్పర్యాలతో సహా ఈ పద్యం గురించి  శంకరాభరణం - చమత్కార పద్యాలు - 144 టపా ద్వారా తెలుసుకోవచ్చును.

సరే ప్రస్తుతం‌ ఈ‌ పాదపం‌ నడక దగ్గరకు వద్దాం. దీని నడక గణానువర్తిగా కనిపిస్తోంది. యతిస్థానం దగ్గర విరామం. ఇతరత్రా గణాంతాల్లో కించిల్లఘువిరామంగా చతురస్రగతిలో దీని నడక పొడచూపుతున్నది.

        వారిని - ధుల్పొడి - బారెడు - దాకన్
        తారలు -  నింగికి - తప్పెడు - దాకన్
        వారిజ - మిత్రుని - పంచత - దాకన్
        ధారుణి - రామక - థామృత - ముండున్

ఆసక్తి కలవారు ఈ‌ పాదపాలను కూడ సులభంగా సాధించవచ్చును. వీలైతే ప్రయత్నించండి.